ప్యాకేజీ, హోదా ఏది మంచిదైతే అది: సుజనా, బాబుపై వైసిపి ధ్వజం
హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనా చౌదరి అన్నారు. కేంద్రం అధ్యయన చేస్తోందని ఆయన శుక్రవారం మీడియాతో చెప్పారు.
ఆశించిన దానికన్నా మంచి ప్యాకేజీని ఈ నెలాఖరులోగా కేంద్రం ప్రకటిస్తుందని ఆయన చెప్పారు సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఏది మంచిదైతే అది తీసుకుంటామని ఆయన ఆయన చెప్పారు. కాగా, పార్లమెంటులో కాంగ్రెసు వ్యవహరించిన తీరుపై ఆయన దుమ్మెత్తి పోశారు.
దేశ భవిష్యత్తను కాంగ్రెసు పార్టీ నాశనం చేస్తోందని ఆయన విమర్శించారు. పార్లమెంటులో కాంగ్రెసు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని అన్నారు. ప్రజలకు జరగబోయే నష్టాన్ని కాంగ్రెసు పార్టీ ఆలోచించడం లేదని ఆయన అన్నారు. పార్లమెంటరీ వ్యవస్థకే తలవంపులు తెచ్చిందని అన్నారు. ప్రజాధనాన్ని వృధా చేసిన కాంగ్రెసు తీరును అందరూ గమనించారని సుజనా చౌదరి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు విరుచుకుపడ్డారు. నిరుడు పంద్రాగస్టు రోజున సీఎం చంద్రబాబు చేసిన హామీలు ఒక్కటీ నెరవేరలేదని విమర్శించారు. టీడీపీ నాయకులు బహిరంగంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కర్నూలులోని స్థానిక వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్రెడ్డి, ఐజయ్య, గౌరు చరిత, మణిగాంధీలు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రుణమాఫీ అంటూ ప్రజలను మభ్యపెట్టారని, తీరా గెలిచిన తరువాత రుణమాఫీ చేయకుండా తప్పించుకుతిరుగుతున్నాడని దుయ్యబట్టారు.