స్ట్రీట్ ఫైట్: మరో ఇద్దరు బాలుర మృతిపై దర్యాప్తు, రెండు గ్యాంగ్లు
హైదరాబాద్: స్ట్రీట్ ఫైట్లో మొహమ్మద్ నబీల్ మృతి చెందిన నేపథ్యంలో పోలీసులు మరో ఇద్దరు బాలుర మృతిపై కూడా దృష్టి పెట్టారు. హైదరాబాదులోని అంజేషామ్ ప్రాంతానికి చెందిన వారిద్దరు కూడా నబీల్ మిత్రులే. వారి మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇబ్రహీం యాఫై అనే 17 ఏళ్ల బాలుడు బర్కాస్లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మొహమ్మద్ ముఫాసిర్ అనే బాలుడు డిప్రెషన్తో నాలుగు నెలల క్రితం మరణించాడు. ఈ రెండు మరణాలపై కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదని వార్తలు వచ్చాయి.
ఆ రెండు మరణాలకు కూడా స్ట్రీట్ ఫైట్ వంటి సంఘటనలతో సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, సంబంధం ఉన్నట్లు ఆధారాలు లభించలేదని, ఆ మరణాల గురించి పోలీసులకు సమాచారం అందించలేదని అంటున్నారు.
కాగా, కొద్ది నెలల క్రితం నబీల్ ఇంటి నుంచి పారిపోయాడని, కుటుంబ సభ్యులు నాలుగైదు రోజుల తర్వాత అతన్ని పట్టుకున్నారని, అలా ఎందుకు పారిపోయాడనేది మిస్టరీగానే ఉందని అంటున్నారు.
నబీల్ పరిచయస్థుల్లో రెండు గ్రూపులున్నాయని అంటున్నారు. అరేబియన్, టైగర్ అనే రెండు గ్రూపులున్నాయని, నబీల్ కేసులో నిందితుడు ఒమర్ బేగ్ అరేబియన్ గ్యాంగ్కు నాయకత్వం వహిస్తున్నడని, నబీల్ టైగర్ గ్యాంగ్లో ఉన్నాడని చెబుతున్నారు.
నబీల్కు పంచ్లు ఇచ్చిన ఓవైస్ అరేబియన్ గ్యాంగ్కు చెందినవాడని అంటున్నారు. రెండు గ్యాంగ్ల మధ్య శత్రుత్వమేదీ లేదని, వినోదం కోసం ఇలా రెండు గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారని వార్తలు వచ్చాయి.