అశ్లీల చిత్రాన్ని పోస్టు చేసి, అమ్మాయిని డబ్బులడిగిన విద్యార్థి
హైదరాబాద్: మార్ఫింగ్ చేసిన అమ్మాయి అశ్లీల చిత్రాన్ని ఆన్లైన్లో పోస్టు చేసి, దాన్ని తొలగించడానికి డబ్బులు డిమాండ్ చేసిన 21 ఏళ్ల విద్యార్థిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు సోమవారంనాడు చెప్పారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లో నకిలీ ఖాతా తెరిచి, మార్ఫ్ చేసిన అశ్లీల చిత్రాన్ని అతను పోస్టు చేశాడు.
ఆ నకిలీ ఖాతా నుంచి ఆ చిత్రాన్ని తొలగించడానికి అమ్మాయిని మేకల యశ్వంత్ రెడ్డి అనే విద్యార్థి డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాదులోని హిమాయత్నగర్లో నివసించే యశ్వంత్ రెడ్డిని అరెస్టు చేశారు. ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో తన కన్నా జూనియర్ అయిన అమ్మాయిపై అతను ఆ ఆగడానికి పాల్పడ్డాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తమ జూనియర్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి, అశ్లీలంగా తయారు చేసి, వాటిని సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పోస్టు చేయడం ద్వారా డబ్బులు గుంజే పథకాన్ని యశ్వంత్ రెడ్డి తన మిత్రుడితో కలిసి ప్రణాళిక రచించాడని అసిస్టెంట్ పోలీసు కమిషనర్ ఎం స్నేహిత చెప్పారు.
మరిన్ని ఆ విధమైన ఫొటోలను సోషల్ నెట్వర్కింగ్ సైట్లలోని తమ కాలేజీ పబ్లిక్ పేజీల్లో పోస్టు చేయకూడదంటే డబ్బులు ఇవ్వాలని వారిద్దరు అమ్మాయిని డిమాండ్ చేసినట్లు చెప్పారు. యశ్వంత్ రెడ్డి పోలీసులు ఈ నెల 20వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. ఫోటోలను అప్లోడ్ చేయడానికి అతను వాడిన కంప్యూటర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.