ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి కలిగించాలి: తిరుపతిపై సుప్రీం కోర్టుకు సుబ్రహ్మణ్య స్వామి
తిరుపతి/న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్యూపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి తన న్యాయ నిపుణులతో మంతనాలు జరిపారు. తిరుమల ఆలయాన్ని ఏపీ గుప్పిట్లో నుంచి విముక్తి కలిగించాలని కోరుతూ ఆయన సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయనున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించినట్లు సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. కోర్టులో దాఖలు నిమిత్తం వ్యాజ్యం తయారు చేస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి చెన్నైలో న్యాయవాద మిత్రులు మోహన్దాస్, టీఆర్ రమేష్, ఆర్ రవిలతో సమావేశమైన చిత్రాన్ని కూడా పోస్టు చేశారు.
రమణ దీక్షితులు తొలగింపును తప్పుబట్టిన స్వామి
తిరుమల ప్రధాన అర్చకులు రమణదీక్షితులును ఆ పదవి నుంచి తప్పించడాన్ని సుబ్రహ్మణ్య స్వామి ఇటీవల తప్పుబట్టారు. టీటీడీ శ్రీవారి నిధులను దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఈ విషయంలోను ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లనున్నారు. టీటీడీ నిధుల దుర్వినియోగంపై సీబీఐ విచారణను కోరనున్నారు.
పలు అంశాలపై సుప్రీం కోర్టుకు
రమణ దీక్షితులను టీటీడీ బోర్డు తొలగించడం పూర్తిగా చట్టవిరుద్ధమని, బోర్డు నిర్ణయాన్ని కొట్టివేయాల్సిందిగా కోరుతూ సుప్రీంకు వెళ్తామని గతవారం సుబ్రహ్మణ్య స్వామి ప్రకటించారు. టీటీడీ బోర్డు ఆలయ నిధుల దుర్వినియోగంపై సుప్రీం పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరనున్నట్టు తెలపడం, ఇప్పుడు ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి టీటీడీని విముక్తి చేయాలని సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసేందుకు సిద్ధమవడం గమనార్హం.
రమణదీక్షితులు ఆరోపణలపై పుట్టా సుధాకర్ యాదవ్
మరోవైపు, రమణదీక్షితులు చేస్తున్న వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆదివారం అన్నారు. నెల్లూరు నగరం కస్తూర్బా కళాక్షేత్రంలో ఆయనకు జరిగిన సన్మానం అనంతరం మీడియాతో మాట్లాడారు.
బెంగళూరులో చెప్పడమెందుకు? తిరుమలలో మాట్లాడాలి
రమణదీక్షితులు ఏదైనా చెప్పాలనుకుంటే తిరుమలలో మాట్లాడాలని పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. కానీ బెంగళూరు, చెన్నైలలో మాట్లాడడం సరికాదన్నారు. 21ఏళ్ల పాటు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి సేవచేసిన ఆయన అవాస్తవాలు మాట్లాడడం దారుణమన్నారు. ఆయన వ్యాఖ్యలు వెనుక రాజకీయ కుట్ర దాగుందన్నారు.