టీటీడీ, రమణదీక్షితులు వేటుపై సుప్రీంకు స్వామి: తీవ్రంగా స్పందించిన పవన్
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వివాదం మరో మలుపు తిరిగింది. టీటీడీపై ఆరోపణలు చేసిన రమణదీక్షితులను తొలగించడంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళతామని స్పష్టం చేశారు.
వేటు, అవినీతిపై.. సుప్రీంకోర్టుకు స్వామి
రమణదీక్షితులు తొలగింపుతోపాటు టీటీడీలో జరుగుతున్న నిధుల దుర్వినియోగంపైనా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు సుబ్రమణ్యస్వామి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో స్పందించారు. టీటీడీలో ఆర్థిక అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
సీఎం స్పందించాలి: పవన్
టీటీడీ వివాదంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. భగవంతుని సేవలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వం ఆయన ఆరోపణలపై విచారణ జరపాలని అన్నారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించాలని, జవాబు చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. అర్ధరాత్రి దర్శనాలు చేయడమేంటని, శ్రీవారికి విశ్రాంతి అవసరం లేదా? అని పవన్ ప్రశ్నించారు.
ఇజ్రాయెల్కు శ్రీవారి నగలు
గతంలో కాంగ్రెస్ హయాంలో శ్రీవారి నగలు ఇజ్రాయెల్ తరలించారని ఓ అధికారి తనకు చెప్పారని పవన్ తెలిపారు. అప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉందని, చంద్రబాబు దీనిపై ప్రశ్నించారని తెలిసిందని చెప్పారు. అలాగే బాంబే నుంచి వచ్చిన ఓ భక్తుడు ముంబైలో స్థలం శ్రీవారికి అప్పగించారని, అయితే, అక్కడ మాత్రం ఎవరో బిల్డింగ్లు కట్టుకొని ఉంటున్నట్లు ఆ భక్తుడు వాపోయినట్లు పవన్ తెలిపారు. అర్చకులపై దాడులు చేయడం సరికాదని పవన్ అన్నారు.
కట్టుబడి ఉన్నా.. రమణదీక్షితులు
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా పని చేస్తూ అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు టీటీడీపై ఆరోపణలు, విమర్శలు గుప్పించిన ఎవి రమణదీక్షితులపై గతవారమే వేటు పడింది. ఆయనను ప్రధాన అర్చకులుగా తొలగిస్తూ గత గురువారం టీటీడీ నిర్ణయం తీసుకుంది. మరోపక్క దేవస్థానం చరిత్రలో తొలిసారిగా ఒకేసారి నలుగురు ప్రధాన అర్చకులను నియమించింది. పూర్వపు మిరాశీ వ్యవస్థ కింద గొల్లపల్లి కుటుంబం నుంచి వేణుగోపాల దీక్షితులు, పైడిపల్లి వంశీయుల నుంచి కృష్ణ శేషాచల దీక్షితులు, పెద్దింటి కుటుంబం నుంచి శ్రీనివాస దీక్షితులును బుధవారమే నియమించగా తిరుపతమ్మ కుటుంబం నుంచి గోవిందరాజ దీక్షితులను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అర్చకులకు విధులు కేటాయింపు బాధ్యతలు ప్రధాన అర్చకుల చేతిలోఉండగా ఈ విధానాన్ని టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోకు అధికారాలు బదలాయిస్తూ టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ గురువారం నిర్ణయం తీసుకున్నారు. కాగా, టీటీడీపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని రమణదీక్షితులు తెలిపారు. తాను చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.