ఢిల్లీకి రిషికేశ్వరి ఇష్యూ! కేసులో కొత్త ట్విస్ట్లు, థియేటర్ కాదు.. మల్టీప్లెక్స్
గుంటూరు/న్యూఢిల్లీ: నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి కేసును సిబిఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. ఆయన ఢిల్లీలో ఆదివారం రాజ్నాథ్ను కలిశారు.
ఫింగర్ ప్రింట్స్ సేకరణ
రిషికేశ్వరి కేసులో న్యాయాన్నికోరుతూ ఎస్ఎఫ్ఐ శనివారం శంకర్ విలాస్ కూడలిలో చేతిముద్రల సేకరణ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నేతలు మాట్లాడారు. రిషికేశ్వరికి న్యాయం జరగాలని, ప్రిన్సిపల్ బాబురావును ఏ1 ముద్దాయిగా చేర్చాలన్నారు. ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.
బాబురావును అరెస్టు చేయక పోవడం దుర్మార్గమన్నారు. ప్రిన్సిపల్ బాబురావును అరెస్టు చేయక పోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం హస్తం ఉన్నట్లుగా అనుమానాలున్నాయన్నారు. కాగా, నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ నిజమేనని చీఫ్ వార్డెన్ స్వరూపా రాణి చెప్పిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, బాలికల వసతి గృహాల వార్డెన్ బాధ్యతలకు స్వరూప రాణి జూలై 30వ తేదీనే రాజీనామా చేసినట్లుగా కొత్త వాదన తెరపైకి వచ్చింది. రిషికేశ్వరి ఘటన అనంతరం తన పైన విమర్శలు రావడంతో కలత చెంది ఆమె రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది.
తాను వార్డెన్గా మూడేళ్ల క్రితం నియామకమై జూలై 6కు మూడేళ్లు దాటిందని, పలుమార్లు రిలీవ్ కోరినా కొనసాగించారన్నారు. రిషికేశ్వరి ఘటనలో విచారణకు సహకరించేందుకు 30వ తేదీ వరకు వార్డెన్గా కొనసాగినట్లు చెప్పారు.
మరోవైపు, రిషికేశ్వరి ఘటన పైన విచారణ కమిటీ గడువును ఏపీ ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించింది. కమిటీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్య స్వామి రాసిన లేఖ మేరకు గడువు పెంచినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
రిషికేశ్వరి కేసులో మరో విద్యార్థి ప్రమేయం?
రిషితేశ్వరి ఘటనలో దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. సీనియర్ల వేధింపుల కారణంగానే రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకుందన్న విషయాన్ని నిర్ధారించుకున్న పోలీసులు ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
తాజాగా ఈ ఘటనలో మరో విద్యార్థికి కూడా ప్రమేయముందని పోలీసులు నిర్ధారించారని సమాచారం. ప్రస్తుతం ఆ విద్యార్థి కోసం పోలీసులు వేట మొదలెట్టారు. ఇక రిషికేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన రోజు రాత్రి నిందితులతో కలిసి ఆమె మంగళగిరిలోని థియేటర్కు సినిమాకు వెళ్లినట్లు ఇది వరకు పోలీసులు చెప్పారు.
అయితే విజయవాడలోని మల్టీప్లెక్స్ థియేటర్కు వారంతా సినిమాకు వెళ్లారని తాజాగా పోలీసులు గుర్తించారు. సినిమా చూసిన అనంతరం రాత్రి పదకొండు గంటలకు హాస్టల్కు చేరుకున్న రిషికేశ్వరి భోజనం చేసి పడుకుందని తెలుస్తోంది. అయితే విజయవాడ మల్టీప్లెక్స్, ఆ తర్వాత హాస్టల్లో ఏం జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.