కేంద్రంతో వైసీపీ తీరులో సడన్ ఛేంజ్ : కౌంటర్ ఎటాక్ - ఏం జరుగుతోంది..!!
కేంద్రంతో వైసీపీ వ్యవహరిస్తున్న తీరులో మార్పు కనిపిస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయం నుంచి కేంద్రంతో రాజకీయంగా సత్సంబంధాలు కొనసాగిస్తోంది. కేంద్రానికి అవసరైన ప్రతీ సందర్భంలోనూ సంఖ్య పరంగా పార్లమెంట్ లో బలంగా ఉన్న వైసీపీ మద్దతిస్తూనే ఉంది. కానీ, ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర నిర్ణయాలు..వ్యవహార శైలి పైన వైసీపీ నేరుగా కౌంటర్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం కేంద్రం శ్రీలంక సంక్షోభం పైన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమయంలో రాష్ట్రాల ఆర్దిక పరిస్థితులను ప్రస్తావించింది. ఏపీ గురించి ప్రస్తావనకు వచ్చింది. దీని పైన వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

కేంద్రం తీరుకు కౌంటర్
దీనికి కౌంటర్ గా వైసీపీ పార్లమెంటరీ నేత విజయ సాయిరెడ్డి ఢిల్లీలోనే పార్టీ ఎంపీలతో కలిసి కౌంటర్ ఇచ్చారు. కేంద్రం కంటే ఏపీ ఆర్దిక పరిస్థితి మెరుగ్గా ఉందని స్పష్టం చేసారు. కేంద్రం - ఏపీ ఆర్దిక పరిస్థితుల పైన గణాంకాలతో వివరించారు. ఇక..పోలవరం సవరించిన అంచనాలకు ఇప్పటి వరకు కేంద్రం ఆమోదం తెలపకపోవటం పైన సీఎం జగన్ పోలవరం ముంపు గ్రామాల పర్యటన సమయంలో ఒకింత అసహనం వ్యక్తం చేసారు. అక్కడ ఇవ్వాల్సిన పరిహారం తమ శక్తికి మించి ఉందని.. తాను పదే పదే ప్రధానిని ఈ విషయంలో అభ్యర్ధించానని చెప్పుకొచ్చారు. ఇక, ఈ సారి కలిసినప్పుడు నిర్వాసితులు ప్రధానినే తిట్టుకుంటున్నారనే విషయం నేరుగా ఆయనకే చెబుతానంటూ వ్యాఖ్యానించారు.

కేంద్రం దోపిడీ చేస్తోందంటూ
ఇప్పుడు, తాజాగా పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి రాజ్యసభలో ద్రవ్యోల్బణం..అధిక ధరలను నియంత్రించటంతో కేంద్రం విఫలమైందంటూ ఫైర్ అయ్యారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయి పేద, మధ్య తరగతి ప్రజలపై భారం తీవ్రంగా పడుతుందన్నారు. బొగ్గు, నూనె ధరలు ఏడేళ్ల అత్యంత గరిష్ట స్థాయికి చేరాయని చెప్పుకొచ్చారు.సెస్, సర్ చార్జి లలో రాష్ట్రాలకు ఎందుకు వాటా ఇవ్వరని సాయిరెడ్డి ప్రశ్నించారు. కేంద్రం తన మొత్తం పన్నుల వాటాలో 41 శాతం వాటా ఇవ్వడం లేదని నిలదీసారు. కేవలం 31 శాతం పన్నుల వాటా మాత్రమే రాష్ట్రాలకు అందుతోందన్నారు. దీని వల్ల ఏడేళ్లలో 46 వేల కోట్ల రూపాయలు ఏపీ నష్టపోయిందని కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రాల నుంచి సెస్, సర్ చార్జీల రూపంలో కేంద్ర ప్రభుత్వం దోపిడీ చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లను పెంచాలని డిమాండ్ చేసారు.

అధిక ధరలకే కేంద్రం కారణమంటూ
విదేశాలలో ద్రవ్యోల్బణం ఉందని కేంద్ర ప్రభుత్వం తనను తాను సమర్థించుకోవడం సరైంది కాదంటూ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వ తీరు పైన కేంద్ర మంత్రులు..బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ గానే సాయిరెడ్డి పార్లమెంట్ వేదికగా కేంద్రం పైన ఈ తరహాలో ఎటాక్ చేసిన బీజేపీ నేతలకు సమాధానంగా వైసీపీ కౌంటర్ ఎటాక్ చేసినట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి. అదే సమయంలో ఏపీలోనూ గడప గడపకు ప్రభుత్వం నిర్వహిస్తున్న సమయంలో సామాన్యులు అధిక ధరల గురించి ప్రశ్నిస్తున్నారు. దీనికి కేంద్రం తీరు కారణమని చెప్పే క్రమంలోనే పార్లమెంట్ ను వేదికగా చేసుకున్నారనే చర్చ వినిపిస్తోంది. అయితే, ఇది రాజకీయ చర్చల వరకే పరిమితం అవుతుందా..లేక, సంబంధాల పైనా ప్రభావం చూపుతుందా అనేది చూడాలి.












Click it and Unblock the Notifications