టీ బిల్లుపై తెలుగులో సుధారాణి, కుప్పకూలిన కెవిపి
విభజన బిల్లుకు తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సీమాంధ్ర సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్ తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తుండగా, ప్లకార్డులు ప్రదర్శిస్తుండగా ఆమె తెలంగాణ బిల్లుకు మద్దతుగా మాట్లాడారు. తెలంగాణకు చెందిన టి. దేవేందర్ గౌడ్ కూడా బిల్లుకు మద్దతు ఇచ్చారు. ఇరు ప్రాంతాలకు న్యాయం జరగాలన్నదే తమ విధానమని ఆయన చెప్పారు.
గ్రామాలు మునిగిపోకుండా పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని ఆమె కోరారు. తెలంగాణ కోసం నిరవధిక నిరాహార దీక్ష చేసి తాను కూడా జైలుకు వెళ్లినట్లు ఆమె తెలిపారు. తెలంగాణ కల సాకారం కావడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు.
విభజన బిల్లుకు వ్యతిరేకంగా గత ఐదు రోజులుగా కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు అధ్యక్ష స్థానం వద్ద నిలబడి నిరసన తెలుపుతున్నారు. ప్లకార్డు ప్రదర్శిస్తూ ఏమీ మాట్లాడకుండా నిలబడుతూ వచ్చారు. అయితే, కెవిపి గురువారంనాడు నిలబడలేక కుప్పకూలారు. ఆయనను ఆస్పత్రికి తీసుకుని వెళ్లాల్సిందిగా సభాధ్యక్ష స్థానంలో ఉన్న కురియన్ సూచించారు. కానీ ఆయన కూర్చునే నిరసన తెలుపుతున్నట్లు సమాచారం.