పవన్ కళ్యాణ్పై సుగాలి ప్రీతి తల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఎన్నికల సమయంలో పవన్ ప్రధానంగా ప్రస్తావించిన సుగాలీ ప్రీతి వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తానని చేయలేదని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై గన్నవరం పోలీస్ స్టేషన్లో సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీదేవి ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో పవన్ పైన ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసు లకు ఫిర్యాదు చేశారు. తక్షణమే పవన్ కల్యాణ్పై కేసు పెట్టాలని కోరారు. గన్నవరం పోలీసు స్టేషన్ కు వచ్చిన సుగాలి ప్రీతి తల్లి.. పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదును అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు ముగిసిపోతున్నా ఇప్పటివరకు తన కుమార్తె మృతి కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం అత్యంత బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో జరిగిన కొన్ని పోలీసు చర్యలను ప్రస్తావిస్తూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.కేవలం ఒక యూట్యూబర్ రావణ్ను అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం గత ఐదు రోజులుగా దాదాపు 500 మంది పోలీసులు, నాలుగు జిల్లాల ఎస్పీలను ఉరుకులు పరుగులు పెట్టించిందని గుర్తు చేశారు.

కీలక మలుపు
కాగా..తన కూతురిని పొట్టనబెట్టుకున్న అసలైన నిందితులు స్వేచ్ఛగా తమ కళ్ల ముందే తిరుగు తున్నారని ఆమె ఆరోపించారు. ఆ యూట్యూబర్ కేసుపై పోలీసులు పెట్టిన శ్రద్ధలో కనీసం 10 శాతం శ్రద్ధ తమ సుగాలి ప్రీతి కేసుపై పెట్టి ఉంటే, ఈ పాటికే తమ కుటుంబానికి న్యాయం జరిగే దని వ్యాఖ్యానించారు. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో ఈ కేసుపై పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున పోరాటం చేసారు. కర్నూలు వేదికగా లాంగ్ మార్చ్ నిర్వహించారు. తాము అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని పవన్ హామీ ఇచ్చారని గుర్తు చేసారు. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా కేసు రీ-ఓపెన్ లేదా వేగవంతం కాకపోవడంపై పార్వతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. కాగా.. ఇప్పుడు నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని బాధితురాలి తల్లి చేసిన ఈ ఆరోపణలతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకున్నట్లు కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications