నేతన్న నేస్తంతో ఏపీలో ఆగిన ఆత్మహత్యలు , ఏపీ చేనేతకు బ్రాండ్ క్రియేట్ చేస్తాం : సజ్జల
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఆప్కో భవన్ లో ఈరోజు జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతన్న నేస్తం పథకంతో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయాయని, నేతన్న నేస్తం నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపిందని స్పష్టం చేశారు. ప్రభుత్వ సాయంతో చేనేత కార్మికులు నిలబడే ప్రయత్నం చేయాలని సూచించిన ఆయన, గ్రామీణ స్థాయిలో అభివృద్ధి చేద్దామని, గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తామని పేర్కొన్నారు.

అమెజాన్ ఫ్లిప్ కార్ట్ వంటి వెబ్ పోర్టల్ ద్వారా చేనేత విక్రయాలు
భారతీయ చేనేతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని పేర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మా బట్టలు మేమే తయారు చేసుకుంటామని స్వదేశీ ఉద్యమంతో బ్రిటిష్ వారికి మహాత్మాగాంధీ చేనేత గొప్పతనాన్ని ఆనాడే చాటి చెప్పారని గుర్తు చేశారు. చేనేత అనగానే తనకు చట్రంతో వస్త్రం నేయడం గుర్తుకు వస్తుందని పేర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి అది తనకు మరిచిపోలేని జ్ఞాపకం అన్నారు. ఖాదీ, చేనేత, పొందూరు వస్త్ర పరిశ్రమల ద్వారా తయారైన వస్త్రాలను నవతరానికి చేరువ చేస్తామని వెల్లడించిన ఆయన అమెజాన్ ఫ్లిప్ కార్ట్ వంటి వెబ్ పోర్టల్ ద్వారా విక్రయాలు పెంచుతామని వెల్లడించారు.

బీజేపీపై విరుచుకుపడిన సజ్జల
ఇదే సమయంలో కాషాయమే రాజకీయ అజెండాగా బిజెపి పనిచేస్తుందని బీజేపీపై నిప్పులు చెరిగారు సజ్జల రామకృష్ణారెడ్డి. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పని చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని పేర్కొన్న ఆయన బిజెపి పాలిత రాష్ట్రాలు ఏమైనా నోట్లు ముద్రించుకుంటున్నాయా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు కేంద్రం చేసిన అప్పు ఎంత అని ప్రశ్నించి లెక్కలు బయటకు తీయాలని, తామెప్పుడూ కేంద్రాన్ని నిందించ లేదని స్పష్టం చేశారు. ఇక పోలవరం నిధులు విడుదల కోసం బిజెపి నాయకులు పనిచేసి, క్రెడిట్ మీ ఖాతాలోనే వేసుకోండి అంటూ హితవు పలికారు సజ్జల రామకృష్ణారెడ్డి.

చేనేతల ద్వారా భావితరాలకు శిక్షణ : మంత్రి గౌతమ్ రెడ్డి
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి నైపుణ్యమున్న చేనేతల ద్వారా భావితరాలకు శిక్షణ ఇస్తామని స్పష్టం చేశారు. గ్రామీణ స్థాయిలో సౌకర్యాలు కల్పించడంలో అభివృద్ధిని పేర్కొన్న ఆయన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారైన చేనేత వస్త్రాలకు బ్రాండ్ క్రియేట్ చేస్తామని వెల్లడించారు. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద భవనాల నిర్మాణాలు కాదని, గ్రామీణ స్థాయిలో సకల సౌకర్యాలను కల్పించడమే అభివృద్ధి అని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భావిస్తారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆప్కో చైర్మన్ చల్లపల్లి మోహన్ రావు, చేనేత శాఖ అధికారులు పాల్గొన్నారు .
Recommended Video

నేతన్నల పరిస్థితిపై చంద్రబాబు.. మేమొచ్చాకే నేతన్న నేస్తం అంటూ సజ్జల
ఇదిలా ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక నేతన్నల బ్రతుకులు దయనీయంగా మారాయని చంద్రబాబు విమర్శిస్తున్నారు. నేతన్నల సంక్షేమం కోసం టీడీపీ అమలు చేసిన పథకాలు ఇప్పుడు అమలు కావటం లేదని నేతన్నల బ్రుతుకులు చీకట్లో ఉండిపోయాయని ఆయన విమర్శించారు. చంద్రబాబు తమ టీడీపీ పాలనలోనే నేతన్నలు స్వర్ణ యుగం చూశారని చెప్పుకొస్తే నేతన్న నేస్తం ద్వారా నేత కార్మికుల బ్రతుకులు బాగు పడుతున్నాయని సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. జాతీయ చేనేత దినోత్సవం సదర్భంగా ఎవరికి వారు చేనేతపై తమదైన వ్యాఖ్యలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications