రాజీనామా చేస్తాం!: సుజన, అశోక్, నాకే మండింది.. చంద్రబాబు క్లాస్
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా రగడ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే అవుననే చెప్పవచ్చు. ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబుతో టిడిపి ఎంపీలు, ముఖ్య నేతలు భేటీ అయ్యారు.
కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు, కేంద్రం తీరుపై ఈ భేటీలో టీడీపీ నేతలు చర్చించారు. ఈ సందర్భంగా టిడిపి ఎంపీలు, కేంద్రమంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు ఆసక్తికర ప్రతిపాదన ముందుకు తెచ్చారని తెలుస్తోంది.
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితుల్లో బీజేపీ లేదని, ఇలాంటి సమయంలో అవసరమైతే పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము తమ కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేస్తామని చంద్రబాబు ఎదుట ప్రతిపాదించారు.

దానికి చంద్రబాబు.. ప్రధాని మోడీని కలుద్దామని, ఆయన స్పందనను బట్టి నిర్ణయం తీసుకుందామని చెప్పారు. ప్రధాని అపాయింటుమెంట్ కోసం నిరసన సరికాదన్నారు. ఆయనను కలుద్దామని, ఆయన స్పందనను బట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అది చేద్దామన్నారు.
ఎంపీలకు చంద్రబాబు క్లాస్
శుక్రవారం నాడు రాజ్యసభ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని అరుణ్ జైట్లీ దాదాపు తేల్చేసిన సమయంలో టిడిపి ఎంపీలు నిమ్మకుండటంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది.
జైట్లీ ప్రకటన చూస్తుంటే తనకే కోపం వచ్చిందని, సభలో ఉన్న మీరు ఎందుకు స్పందించలేదని ఆగ్రహించారని తెలుస్తోంది. దానికి వారు... కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అలా జరిగిందని వివరణ ఇచ్చారని తెలుస్తోంది. ఈ సమయంలో చంద్రబాబు కల్పించుకొని ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని, మనకంటే వారే ఎక్కవగా విశ్లేషిస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications