బాబుతో టచ్లో ఢిల్లీ పెద్దలు: మొదటి అడుగు.. రాజీనామాపై సుజనా ట్విస్ట్
అమరావతి: పార్లమెంటులో ఏపీకి రావాల్సిన వాటి గురించి తాము పోరాడుదామని, ఇది మొదటి అడుగు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారని కేంద్రమంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి అన్నారు. చంద్రబాబు కేంద్ర పెద్దలతో టచ్లో ఉన్నారని చెప్పారు.
ఆదివారం ఉదయం చంద్రబాబుతో టీడీపీ ఎంపీలు భేటీ అయిన విషయం తెలిసిందే. సుదీర్ఘంగా భేటీ అయ్యారు. భేటీ అనంతరం సుజనా చౌదరి మాట్లాడారు. చంద్రబాబుపై బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం ఆపేది లేదు
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే వరకు పోరాటం ఆపేది లేదని సుజన చెప్పారు. కేంద్రం పెద్దలు చంద్రబాబుతో టచ్లో ఉన్నారని తెలిపారు. కేంద్రం నుంచి తాము వైదొలగాలా లేదా అన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. రాజీనామాలపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని అభిప్రాయపడ్డారు.

చేసినవి కొన్నే, చేయాల్సినవి చాలా
కేంద్రం ఇప్పటి వరకు చేసింది కొన్నేనని, చేయాల్సినవి చాలా ఉన్నాయని సుజనా చెప్పారు. ఏపీకి ఇచ్చిన హామీలు, విభజన చట్టంలో పెట్టిన హామీలు త్వరలో పూర్తి చేసేలా తాము పోరాటం చేస్తామని చెప్పారు. గట్టిగా మాట్లాడి మనకు రావాల్సినవి రాబడతామన్నారు.

న్యాయం జరగకపోతే నిరసన
రాష్ట్రానికి న్యాయం జరగకపోతే నిరసన తెలియజేస్తామని సుజనా అన్నారు. చర్చలు జరుగుతున్నా నిధులు రావడం లేదన్నారు. మూడున్నరేళ్లుగా పోరాడుతున్నా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. సందర్భానుసారాన్ని బట్టి పార్లమెంటులో నిరసన తెలుపుతామన్నారు.

ఇది మొదటి అడుగు
చంద్రబాబుతో భేటీలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చించామని చెప్పారు. ఈ బడ్జెట్ నేపథ్యంలో ప్రజలు పూర్తి నిరాశలో ఉన్నారని చెప్పారు. ఇది మొదటి అడుగు అని చంద్రబాబు చెప్పారని వ్యాఖ్యానించారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు.












Click it and Unblock the Notifications