స్పెషల్ ఎఫెక్ట్: హఠాత్తుగా ఢిల్లీకి బాబు, సుజన కొత్తగా 'ప్రత్యేక' ట్విస్ట్
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ పైన ఢిల్లీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీలో ఉండాలని కేంద్రం భావిస్తోంది. కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి ద్వారా చంద్రబాబును ఢిల్లీకి ఆహ్వానించింది.
చంద్రబాబుకు కేంద్రమంత్రి వెంకయ్య కూడా ఫోన్ చేసి పిలిచారు. ఢిల్లీ పిలుపు నేపథ్యంలో చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులు, సీనియర్లతో చర్చలు జరుపుతున్నారు. వెళ్లాలా వద్దా అనే విషయమై కూడా అడుగుతున్నారని తెలుస్తోంది.
చంద్రబాబు ఆగ్రహం-వెంకయ్య చక్రం, దిగొచ్చిన మోడీ: ప్యాకేజీ ఇలా!
దీంతో సీఎం చంద్రబాబు తన వెలగపూడి సచివాలయ పర్యటన వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. ఆయన ఈ రోజు ఢిల్లీలో కాలు పెట్టే అవకాశముంది. చంద్రబాబుతోను ఢిల్లీ పెద్దలు ప్యాకేజీ పైన చర్చలు జరిపి, ఆ తర్వాత లేదా అతనితో కలిసి ప్రకటన చేసే అవకాశముందని అంటున్నారు.
పుణ్యకాలం గడిచిపోతుంది: సుజన
ప్రత్యేక హోదా, భారీ ప్యాకేజీ పైన కేంద్రం తర్జన భర్జన పడుతోందని సుజనా చౌదరి విలేకరులతో అన్నారు. సాయంత్రానికి ఏదనేది క్లారిటీ వస్తుందని మరో ట్విస్ట్ ఇచ్చారు. తాము మాత్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. హోదా విషయంలో చట్టపరంగా కేంద్రానికి ఉన్న అభ్యంతరాల పైన చర్చ జరుగుతోందన్నారు.
ప్రత్యేక హోదా అంశాన్ని ఎండీసీకి పంపించాలని కేంద్రం భావిస్తోంది. దీనిపై సుజన మాట్లాడుతూ.. హోదా అంశాన్ని మళ్లీ ఎన్డీసీకి పంపించాలని కేంద్రమంత్రులు యోచిస్తున్నారని, అదే కనుక జరిగితే పుణ్యకాలం కాస్తా అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో ఉత్కంఠ, ఢిల్లీలో చర్చలు: చూద్దాం.. లెక్కలు వేయమని బాబు
కాగా, ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదని, అయితే దానిని సరితూగే ప్యాకేజీ మాత్రం ఇస్తుందని ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. అయితే, హోదా పైన కేంద్రం తర్జన భర్జన పడుతోందని, సాయంత్రానికి క్లారిటీ వస్తుందని సుజన ట్విస్ట్ ఇవ్వడం గమనార్హం. సుజనా చౌదరి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్తో, వెంకయ్య నాయుడుతో వరుసగా భేటీ అయిన విషయం తెలిసిందే.