కేసుల మాఫీకే జగన్ ఢిల్లీకి, హోదా వస్తుంది: సుజనా చౌదరి
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి రావడం లేదని, కేసులు మాఫీ చేయించుకోవడానికి వస్తున్నారని కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేంద్రం కసరత్తు చేస్తోందని, ఆ ప్రక్రియ ప్రారంభమైందని ఆయన శనివారనాడు అన్నారు.
రంగరాజన్ కమిషన్ సిఫార్సులు అమల్లో ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా కోసం నిరంతరం పనిచేస్తూనే ఉన్నామని చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే సమయంలో ప్రత్యేక హోదా కోసం జగన్ దీక్ష చేయటాన్ని ప్రజలు గమనించాలని మంత్రి కోరారు. పార్లమెంటు సమావేశంలో ముగిసే సమయంలో జగన్ దీక్ష చేయడం హాస్యాస్పదమని టిడిపి పార్లమెంటు సభ్యుడు సిఎం రమేష్ అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాము పోరాటం కొనసాగిస్తున్నామని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సబ్యుడు కొనకళ్ల చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోతే దానికి సమానమైన ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని ఎంపీ కొనకళ్ల వివరించారు.
ప్రత్యేక హోదాపై కేంద్రం చేసిన ప్రకటన తమ రాష్ట్రానికి వర్తించదని ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రధాని మోడీపై తమకు నమ్మకం ఉందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఆయన శనివారం విజయవాడలో మీడియాతో అన్నారు.