కేంద్రంతో మాట్లాడే చెబుతున్నా: అమరావతి అంగుళం కూడా కదలటానికి వీళ్లేదు: సుజనా చౌదరి సంచలనం..!
బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాజధాని మార్పు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతి అంగుళం కూడా కదలటానికి వీళ్లేదని స్పష్టం చేసారు. కేంద్రంతో మాట్లాడిన తరువాతనే చెబుతున్నానని తేల్చి చెప్పారు. మూడు రాజధానుల ప్రస్తావన అర్దం కావటం లేదని వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో స్థానిక ప్రభుత్వానికి అధికారం ఉన్నా..కేంద్రానికి ఉన్న హక్కు ఏంటో సరైన సమయంలో వెల్లడిస్తామని సుజనా స్పష్టం చేసారు.
రాజధాని మారిస్తే పరిహారంగా 80 వేల కోట్ల నుండి 90 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని కొత్త వాదన తెర మీదకు తెచ్చారు. గత ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాలు పూర్తి స్థాయిలో చేయనుందనే అక్కడ టీడీపీని ఓడించారని చెప్పుకొచ్చారు. అమరావతి కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్తే పరిహారం చెల్లిస్తారా అని సుజనా చౌదరి ప్రశ్నించారు.
కేంద్రంతో మాట్లాడే చెబుతున్నానంటూ..
మాజీ కేంద్ర మంత్రి..బీజేపీ రాజ్యసభ సభ్యుడు అమరావతి తరలింపు ప్రతిపాదనల పైన ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. మూడు రాజధానుల ప్రతిపాదనలను ఆయన తప్పు బట్టారు. కేవలం కార్యాలయాల తరలిం పు ద్వారా.. అధికార వికేంద్రీకరణ చేస్తే అభివృద్ధి జరగదని సుజనాచౌదరి అభిప్రాయం వ్యక్తం చేసారు.
తాను కేంద్రంతో మాట్లాడే చెబుతన్నానని.. అమరావతి అంగుళం కూడా కదలటానికి వీళ్లేదని స్పష్టంగా చెప్పారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలు చాలా ఉన్నాయని సుజనాచౌదరి విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతోందని, ఈ 7నెలల్లో రాజధానిలో ఒక్క పని కూడా పూర్తి చేయలేదన్నారు. అమరావతిని స్వాగతిస్తూ 30 వేల ఎకరాలు చాలని..ఆనాడు విపక్షనేతగా ఉన్న జగన్ అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా సుజనాచౌదరి గుర్తుచేశారు. అమరావతిని ఒక్క ఎమ్మెల్యే కూడా వ్యతిరేకించ లేదని అన్నారు.
మారిస్తే 80 నుండి 90 వేల కోట్లు చెల్లించాలి
ఇదే సమయంలో సుజనా చౌదరి కొత్త వాదన తెర మీదకు తెచ్చారు. రాజధాని మారిస్తే ఆర్దికంగా ప్రభుత్వం మీద పడే భారం గురించి విశ్లేషించారు. రాజధాని మార్చాలంటే అమరావతి రైతులకు పరిహారంగా రూ. 80 నుంచి రూ. 90 వేల కోట్లు ఇవాల్సివస్తుందని అన్నారు. అంత డబ్బు ప్రభుత్వం దగ్గర ఉందా అంటూ సుజనా ప్రశ్నించారు. బ్యాంకు రుణాలు తీసుకుని రాజధానిలో నిర్మాణాలు చేపడుతున్నారని, కాంట్రాక్టర్లు కోర్టుకు వెళితే పరిహారం చెల్లిస్తారా? .. లక్షన్నర నుంచి రూ. 2లక్షల కోట్లు చెల్లించాల్సి వస్తుందని సుజనాచౌదరి వ్యాఖ్యానించారు.
రాజధాని కోసం ప్రజలు రూ 42 కోట్లు విరాళం ఇచ్చారని.. 130 కేంద్ర సంస్థలకు భూ కేటాయింపుల చేసారని చెప్పుకొచ్చారు. రాజధాని మార్పు ఊహించే పరిస్థితుల్లో రాష్ట్రం లేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం పాలనను వదిలేసి.. నవరత్నాల కోసం డబ్బు ఖర్చు చేసి ఓట్ల మీదే రాజకీయం చేస్తుందని ఆరోపించారు. దేవాదాయ..వర్సిటీల భూములను అమ్ముతున్నారంటూ మండిపడ్డారు.
టీడీపీని అందుకే ఓడించారు..
రాజధాని నిర్మాణంలో ఆలస్యం జరిగిన విషయం వాస్తవమేనని, ఆ కారణంతోనే రాజధానిలో తెలుగుదేశం పార్టీని ఓడించారని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. అమరావతిలో ఎన్నో నిర్మాణాలు కొనసాగు తున్నాయన్నారు.పలు విద్యాసంస్థలు వచ్చాయని వివరించారు. అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు అవసరం లేదని సుజనాచౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజధానిలో పెండింగ్ పనులు పూర్తి చేసి పాలనపై దృష్టిపెట్టాలన్నారు.
ఏపీ అంటే.. వ్యాపారవేత్తలు వెయ్యి కిలోమీటర్లు పరిగెత్తే పరిస్థితికి తెచ్చారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాలు మారితే రాజధానులు మార్చడమేంటని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతోందని సుజనాచౌదరి విమర్శించారు. రాజధాని అంటే కారు తీసేసి మరో కారు కొనుక్కున్నట్టు కాదని, జగన్ కోరుకున్నచోట భవంతులు నిర్మించుకున్నట్టు కాదని సుజనా చౌదరి అన్నారు. రాజధాని మార్పునకు సీఎం జగన్ కారణాలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.