జగన్ పార్టీ సులభం చేసింది: విభజనపై సుజనా చౌదరి
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మార్గం సులభం చేసిందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని ఉపయోగించి రాష్ట్ర విభజన చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే సూచించిందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జగన్ బయట సమైక్యవాది, లోపల విభజనవాది అని ఆయన అన్నారు.
సమైక్యవాదిగా ప్రజలను మభ్య పెట్టేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. విభజన తీరు ఇది కాదని వివిధ రాజకీయ పార్టీలు తాము చెప్పినప్పుడు అభిప్రాయపడ్డాయని ఆయన అన్నారు. రాజ్యాంగ నిబంధనలను, సంప్రదాయాలను ఉల్లంఘించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనకు పూనుకుంటోందని ఆయన విమర్శించారు.

ఆర్టికల్ 3 సందర్భాన్ని చూడాలని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసుకోవడానికి ఆర్టికల్ 3ని ప్రవేశపెట్టారని, ఇప్పుడు దాన్ని ఉపయోగించడం సరికాదని ఆయన అన్నారు. ఆర్టికల్ 3ని వాడుతూ రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.
విభజన ముసాయిదా బిల్లులో ఎన్నో తప్పులు ఉన్నాయని ఆయన అన్నారు. రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని గానీ గవర్నర్ పాలన గానీ ఎక్కడా లేవని ఆయన అన్నారు. విభజన అంశం గందరగోళంగా మారిందని, శ్రీకృష్ణ కమిటీ నివేదికను బుట్టదాఖలా చేశారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన అంశాన్ని ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వానికి వదిలేయాలని ఆనయ కోరారు.












Click it and Unblock the Notifications