వారు చెప్పినట్లు డ్యాన్స్ చేయలేం, పాఠాలు చెప్పలేం: విపక్షాలపై సుజనా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం చేసే సహాయం విషయంలో ప్రతిపక్షాల తీరును కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనా చౌదరి తప్పు పట్టారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి అందే సాయం విషయంలో, రాష్ట్రాభివృద్ధి విషయంలో చేస్తున్న విమర్శలను ప్రతిపక్షాల విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిపక్షాల నేతలకు తాము కూర్చుని పాఠాలు చెప్పలేమని, తరగతి గదిలో విద్యార్థుల మాదిరిగా అల్లరి చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్షాల డైరేక్షన్ ప్రకారం డ్యాన్స్ చేయడానికి తాము సిద్ధంగా లేమని అన్నారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక సాయం కింద మరో వేయి కోట్ల రూపాయలు విడుదల చేసిందని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన చెప్పారు. రాష్ట్రానికి మరిన్ని కేంద్ర సంస్థలను ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, ఈ విషయంపై అక్టోబర్ 15వ తేదీ నాటికి స్పష్టత వస్తుందని, ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్తో మాట్లాడామని ఆయన అన్నారు
అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్రం హామీ ఇచ్చిందని, ఆ ప్రాజెక్టు విషయంలో గత పదేళ్లలో జరిగిందేమిటో మాట్లాడాల్సిన అవసరం లేదని, దాని గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని ఆయన చెప్పారు. కేంద్రం తాను ఇచ్చిన దాంట్లో 350 కోట్ల రూపాయలు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేటాయించిందని ఆయన చెప్పారు.
గతంలో చత్తీస్గడ్ రాష్ట్రానికి కేంద్రం 1500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందని, ఎపికి ఇప్పటి వరకు 1850 కోట్ల రూపాయలు ఇచ్చిందని ఆయన చెప్పారు. సానుకూల వైఖరితో ముందుకు వెళ్లి పనులు జరిగేలా చూసుకోవాలని, ఎప్పుడూ ధర్నాలు అంటే లాభం లేదని ఆయన అన్నారు. ఇవన్నీ పార్టీపరంగా జరిగేవి కావని, బిజెపి పరంగా జరిగేవి కావని, ప్రభుత్వ పరంగా జరుగుతాయని ఆయన చెప్పారు. పార్లమెంటరీ వ్యవస్థను అర్థం చేసుకుని వ్యవహారాలు చక్కబెట్టుకోవాలని అన్నారు.
చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ వల్ల, బిజెపితో స్నేహం వల్ల ఎపికి కేంద్రం సాయం అంతగా అందుతోందని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు చెప్పినట్లు వినడానికి తాము సిద్ధంగా లేమని, ఐదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన చెప్పారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని అనుకుంటే తమతో పాటు కేంద్ర ప్రభుత్వం వద్దకు ప్రతిపక్షాలు రావాలని, లేదంటే విడిగా విజ్ఞప్తులు చేయాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం వద్దకు అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు.