చెల్లని రద్దైన రూ.500, రూ.1000 వంటిదే, ఊరుకోం: హోదాపై సుజన సంచలనం
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదాను చెల్లని రూ.500, రూ.1000 నోట్లతో పోల్చారు కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుజనా చౌదరి. ఆయన మరో కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు, టిడిపి ఎంపీలతో కలిసి మంగళవారం నాడు విలేకరులతో మాట్లాడారు.
ప్రత్యేక హోదా చెల్లని పాత కరెన్సీ వంటిది అని వ్యాఖ్యానించారు. ఇంకా ప్రత్యేక హోదా కోసం పట్టుబడటం వల్ల ఎలాంటి లాభం లేదని తేల్చి చెప్పారు. అయితే, రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను ఊరుకునేది లేదన్నారు. హోదా డిమాండులో మాత్రం అర్థం లేదని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రానికి రావాల్సిన నిధుల పైన పార్లమెంటులో లేవనెత్తుతామని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత, విశాఖకు రైల్వే జోన్ పైన తాము పట్టుబడతామన్నారు. పోలవరం నిధుల కోసం కేంద్రం పైన ఒత్తిడి తెస్తామని చెప్పారు. వారంలో ఆ నిధులపై స్పష్టత వస్తుందని చెప్పారు.
ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది
రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని, వాటికి పరిష్కారాల పైన దృష్టి సారించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, కేంద్రాన్ని ఏం అడగాలనే విషయమై చర్చించామని చెప్పారు. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా మార్గాలను అన్వేషించాలన్నారు.
నోట్ల రద్దు వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందుల పైన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారన్నారు. పెద్ద నోట్ల రద్దు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో పలుమార్లు లేఖ రాశారన్నారు. వీటి రద్దు వల్ల నకిలీ నోట్లు పూర్తిగా తొలగిపోతాయని చెప్పారు. నోటు రద్దు వల్ల ఏర్పడిన సమస్యలను పార్లమెంటులో చర్చిస్తామని చెప్పారు.
జనవరి తర్వాత పనికి రావు
జనవరి తర్వాత పాత రూ.500, రూ.1000 నోట్లు పనికి రావన్నారు. ప్రత్యేక హోదా కూడా పాత నోట్ల లాంటిదేనని చెప్పారు. లెక్కల్లోకి రాని డబ్బు వెలుగులోకి వస్తే సంక్షేమ పథకాలు బాగా అమలు చేయవచ్చునని చెప్పారు. రూ.2000 నోటు చలామణి పైన చర్చిస్తామని అశోక్ గజపతి రాజు అన్నారు.