చిరంజీవిని లాగిన సుజయ కృష్ణ, ఆ టీడీపీ నేత మాకు అవసరం లేదని పవన్ కళ్యాణ్
విజయనగరం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఏపీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు శనివారం నిప్పులు చెరిగారు. పవన్ ప్రజా పోరాట యాత్ర లక్ష్యం ఏమిటో తెలియడం లేదన్నారు. ఆయన అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోరాడుతున్నారన్నారు.
'సమస్యల'తో పెంచి పోషించి: పవన్ వ్యూహంలో టీడీపీ విలవిల, ఆ ఆయుధం పేలలేదా?
హోదా కోసం, ఏపీ విభజన హామీల కోసం 29సార్లు ఆయన ఢిల్లీకి వెళ్లి అక్కడ అందరినీ కలిశారని చెప్పారు. ఏపీ విషయంలో బీజేపీ నమ్మించి మోసం చేసిందన్నారు. గత నాలుగేళ్లలో ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ ఏం చేసారో చెప్పాలన్నారు. హోదా విషయంలో తమను విమర్శించడం విడ్డూరంగా ఉందని సుజయ అన్నారు.
ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు
ఏపీకి ద్రోహం చేసిన బీజేపీని విమర్శించకుండా ముఖ్యమంత్రిని విమర్శించడం పవన్కు సరికాదని సుజయ అన్నారు. జిల్లాలో ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా ఉందని ఆరోపించిన జనసేనానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదన్నారు. వాస్తవాలు గ్రహించాలన్నారు. జిల్లాలో ఏ మాఫియా లేదని ఆయన స్పష్టం చేశారు.
చిరంజీవి అలా మోసం చేస్తే, పవన్ కళ్యాణ్ ఇలా
తెలుగుదేశం పార్టీ హయాంలోనే విజయనగరం జిల్లాలో అభివృద్ధి జరిగిందని సుజయ అన్నారు. నిరుద్యోగుల పాలిట వరం నిరుద్యోగ భృతి అన్నారు. దానిని పవన్ కళ్యాణ్ తప్పుబట్టడం అవివేకం అవుతుందన్నారు. ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో ఆయన అన్నయ్య చిరంజీవి తన పార్టీని విలీనం చేస్తే, ఇప్పుడు తమ్ముడు పవన్ రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీని కాకుండా సీఎంను విమర్శిస్తున్నారన్నారు.
పోరాట యాత్రలో పేలుతున్న మాటలు
కాగా, ప్రజాపోరాట యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ మాటల తూటాలు పేల్చుతున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఆయాచోట్ల స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ, నేతల అవినీతిపై నేరుగానే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం అశోక్ గజపతి రాజు, సుజయ తదితరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన ఎంపీ కేంద్రంలో మంత్రి పదవిలో ఉన్నా గజపతినగరానికి ఒక్క నిమిషం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఆపాలని ప్రజలు కోరినా పట్టించుకోలేన్నారు.
మాకు ఆ టీడీపీ నేత అవసరం లేదు
తమ పార్టీకి ప్రజలకు అండగా ఉండే నేతలు కావాలి తప్ప భంజ్దేవ్ లాంటి పెద్ద నాయకులు అవసరం లేదని పవన్ తేల్చి చెప్పారు. భంజ్దేవ్ ఎస్టీ కాకపోయినా చంద్రబాబు గిరిజనుడిగా ధ్రువపత్రం ఇచ్చారని, అది అవినీతి కాదా అని ప్రశ్నించారు. పెద్దగెడ్డ రిజర్వాయరు నుంచి వేగావతి నది కాలువల ద్వారా రైతుల పొలాలకు వెళ్లాల్సిన నీటిని టీడీపీ నేత భంజ్దేవ్ అక్రమంగా తన రొయ్యల చెరువుల్లోకి మళ్లిస్తున్నారన్నారు. నీళ్లను ఉపయోగించుకుని మలినాల్ని బయటకు వదిలేస్తుంటే దాంతోనే రైతులు తమ పొలాల్ని పండించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. దీనిని దోపిడీ అనాలా, అవినీతి అనాలా, అరాచకం అనాలా అని ప్రశ్నించారు.
లోకేష్ ఈ పని కూడా చేయలేకపోయారు
ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతి తప్ప సాలూరు వంటి పర్యాటక ప్రాంతాలు కనిపించడం లేదని పవన్ అన్నారు. తాము 17000 కిలోమీటర్ల మేర రోడ్లు వేయించామని మంత్రి లోకేష్ చెబుతారని, కానీ సాలూరు పట్టణానికి ఒక బైపాస్ వేయించలేకపోయారన్నారు. టీడీపీ ఇచ్చిన హామీలలో ఒక్క దానిని నిలబెట్టుకోలేదన్నారు.