16మంది రాజీనామా చేయలేదు: జగన్కు సుజయ షాక్, అఖిలకు స్వాగతం
అమరావతి: నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి 18 మంది ఎమ్మెల్యేలు వచ్చారని, ఇందులో పదహారు మంది రాజీనామా చేయలేదని, ఆ రోజు అందరిచేత రాజీనామా చేయమని చెప్పని వైసిపి అధినేత జగన్ ఈ రోజు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు.
మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత శనివారం తొలిసారిగా జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా విజయనగరంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎవరూ వేలెత్తి చూపే పరిస్థితి తెచ్చుకోనని చెప్పారు.
విజయనగరంలో కర్ఫ్యూకి కారణమైన వ్యక్తులు నేడు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై కూడా కఠినచర్యలు తీసుకుంటామన్నారు. తన శాఖలో రెవెన్యూ పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు.
అఖిల ప్రియకు స్వాగతం
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అమరావతి నుంచి ఆళ్లగడ్డకు వెళ్తుండగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శనివారం సాయంత్రం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద స్వాగతం పలికారు.
స్థానిక టిడిపి నాయకులు, ప్రజాప్రతినిధులను మంత్రికి పరిచయం చేశారు. నియోజకవర్గంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకొని, నిధులు కటాయించాలని అశోక్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి అఖిలను కోరారు. ఆమె సానుకూలంగా స్పందించారు.