అమరావతి శంకుస్థాపనకు యాంకర్గా సునీత: అదృష్టమని వ్యాఖ్య
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన ఉత్సవానికి యాంకరింగ్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలుగు సినీ గాయని సునీత అన్నారు. ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో ఆమె తన భావనలను పంచుకున్నారు. చారిత్రాత్మక అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి యాంకిరంగ్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని ఆమె అన్నారు.
నటుడు సాయి కుమార్తో పాటు సునీత ఈ కార్యక్రమానికి యాంకర్లుగా వ్యవహరించనున్నారు. ప్రజా రాజధాని అమరావతి ఎలా వెలిగిపోతుందో ఇప్పుడే తెలిసిపోతోందని ఆమె అన్నారు. కాస్తా నెర్వస్గా ఉన్నా కార్యక్రమానికి తగినట్లుగా ప్రిపేర్ అయినట్లు ఆమె తెలిపారు. తనకు అవకాశం రావడం గొప్పగానూ గర్వంగానూ అనిపించిందని చెప్పారు.
తాను కఠిన శ్రమను నమ్ముకుంటానని చెప్పారు. చేసేది మంచి పని, నిలిచిపోయే పని అయి ఉండాలని తాను అనుకుంటానని అన్నారు. తనకు రాజకీయ లోతుపాతులు తెలియవని, అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో రాజకీయ వ్యవహారాలు ఏవీ లేవని అన్నారు. అందరూ కలిసి చేసుకుంటున్న పండుగలా అనిపిస్తోందని అన్నారు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమానికి వస్తున్నారని చెప్పారు.
రాష్ట్రం విడిపోవడం బాధగానే ఉన్నా ప్రతికూల ఆలోచనను పక్కన పెట్టి సానుకూల దృక్పథంతో ముందుకు సాగి భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని సునీత అన్నారు. పాజిటివ్ వైబ్రేషన్స్ మధ్య కార్యక్రమం జరగాలని అన్నారు.