రైల్వే బడ్జెట్పై బాబు అసంతృప్తి: మాట్లాడలేకపోతున్నారు, కవిత హ్యాపీ
హైదరాబాద్: కేంద్రమంత్రి సురేష్ ప్రభు ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్ పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితలు వేర్వేరుగా స్పందించారు. ఏపీకి అన్యాయం జరిగింది, ఇది పూర్తి బడ్జెట్ కాదని చంద్రబాబు వాపోగా, ఉమ్మడితో పోలిస్తే కొంత నమయమని తెరాస ఎంపీలు వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా.. విశాఖకు ప్రత్యేక జోన్, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పైన ఆసలు పెట్టుకున్నాయి.
రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో ఏపీకి ఎప్పుడూ అన్యాయం జరుగుతోందని, కొత్త రైల్వేలైన్లు, ప్రాజెక్టుల అభివృద్ధి కోసం అనేకసార్లు పోరాడినా ఫలితం లేదని చంద్రబాబు వాపోయారు. విభజన హామీలో భాగంగా ఇచ్చిన విశాఖ ప్రత్యేక జోన్పై ప్రకటన రాలేదన్నారు. అయితే, ఇది పూర్తి బడ్జెట్ కాదేమోనని, దీనికి కొనసాగింపుగా అదనపు నిధులు, కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.
తమకు న్యాయం కోసం కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. గతంలో రైల్వే మంత్రిని కలిసిప్పుడు జాయింట్ వెంచర్తో రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు గురించి చర్చించామని, దానికి తాము సమ్మతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ కూడా రాశామన్నారు. బడ్జెట్ పైన టీడీపీ నేతలు, ఏపీ మంత్రులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, మిత్రపక్షం కావడం వల్లే ఏం మాట్లాడలేకపోతున్నామని పలువురు అంటున్నారు.
కొత్త రాష్ట్రం వల్లే ఈమాత్రం: కవిత
కొత్త రాష్ట్రం ఏర్పడటం వల్లే తెలంగాణకు ఆమాత్రమైన ప్రాజెక్టులు వచ్చాయని కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్రం ఆవశ్యకత, తెలంగాణ సీఎం, ఎంపీల కృషిని ప్రజలు గుర్తించారన్నారు. ఉమ్మడి ఏపీతో పోలీస్తే ప్రాజెక్టులు బాగానే వచ్చాయన్నారు. నిజామాబాద్ - పెద్దపల్లి లైను దానికి నిదర్శనమన్నారు. ప్రజల అవసరాలు, రాష్ట్రాల నిస్సహాయత దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త లైన్లకు సగం సగం నిధులు భరించాలనడం సరికాదన్నారు.
అలాగే, పలు లైన్లకు కేటాయించిన నిధులు సరిపోవాని మరో ఎంపీ బాల్క సుమన్ అన్నారు. కాజీపేట డివిజన్, కోచ్ ఫ్యాక్టరీ అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. రైల్వే బడ్జెట్ పూర్తి సంతృప్తి ఇవ్వనప్పటికీ భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు తెలంగాణకు వస్తాయని తెరాస ఎంపీలు ఆశించారు. విభజన కారణంగా.. గతంలో కంటే తెలంగాణకు ఎక్కువ ప్రాజెక్టులే వచ్చాయని అభిప్రాయపడ్డారు.