కృష్ణా జలాలపై కేంద్రం తన వైఖరి చెప్పాలి: సుప్రీం, ఏపీలో ఈనెల 30న పెట్రోల్ బంక్ల బంద్
హైదరాబాద్: రాష్ట్ర విభజన కారణంగా కృష్ణా జలాల పంపిణీపై చెలరేగిన వివాదంపై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. బ్రిజేష్కుమార్ తుది, మధ్యంతర తీర్పు అమలు నిలిపివేయాలని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిటిషన్ వేసింది. దీనిపై వాదనలు విన్న సుప్రీం కోర్టు కృష్ణా జలాల వివాదంపై కేంద్రం వైఖరి చెప్పాలని స్పష్టం చేసింది.
ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటి వాటాలోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. తెలంగాణ పిటిషన్పై కేంద్రానికి నోటీసులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తెలంగాణ తరపున వైద్యనాథన్ వాదనలు వినిపించారు. తెలంగాణ పిటిషన్పై కేంద్రానికి నోటీసులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
ట్రిబ్యునల్లో ఖాళీ అయిన సభ్యుడి స్థానాన్ని భర్తీ చేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. తదుపరి విచారణను సుప్రీం కోర్టు సెప్టెంబర్ 10వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
ఈనెల 30న ఏపీలో పెట్రోల్ బంక్ల బంద్
ఏపీలో ఈనెల 30 అర్ధరాత్రి నుంచి 24 గంటల పాటు పెట్రోల్ బంక్ల బంద్ చేస్తున్నట్లు ఏపీ పెట్రోల్బంక్ డీలర్ల అసోసియేషన్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వసూలు చేస్తున్న అదనపు వ్యాట్ పెంపునకు నిరసనగా తాము నష్టపోతున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.
వ్యాట్ తక్కువగా ఉన్న పక్క రాష్ట్రాలకు వినియోగదారులు తరలిపోతుండటంతో అమ్మకాలు పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వం వెంటనే వ్యాట్ తగ్గించాలని కోరుతూ ఈ నెల 30న బంద్ నిర్వహిస్తున్నామని తెలిపారు.