తిరుమల లడ్డుపై సుప్రీం వ్యాఖ్యలు వారికి చెంపపెట్టు: వైఎస్ షర్మిల
తిరుమల లడ్డూ కల్తీపై ఇవ్వాళ సుప్రీంకోర్టు చేసిన సూచనల నేపధ్యంలో, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించి చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. సుప్రీం ధర్మాసనం తిరుమల లడ్డూ విషయంలో చేసిన వ్యాఖ్యలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటిదని వైఎస్ షర్మిల అభిప్రాయం వ్యక్తం చేశారు.
CBI తో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్
తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై కేంద్రం దర్యాప్తు చేయాలని, CBI తో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ముందునుంచే వాదిస్తోందని ఆమె పేర్కొన్నారు . ఇవ్వాళ సుప్రీం ఇచ్చిన సూచన తో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కి బలం చేకూరినట్లయ్యిందని షర్మిల అభిప్రాయపడ్డారు. సిట్ దర్యాప్తు రబ్బర్ స్టాంప్ తప్పా.. విచారణకు ఉపయోగం లేదని షర్మిల అభిప్రాయపడ్డారు.

ఆందోళనలో ఉన్న కోట్లాది మంది భక్తులకు నిజానిజాలు తెలియాలి
CBI కి అప్పగిస్తేనే లడ్డూ కల్తీపై లోతైన దర్యాప్తు జరుగుతుందని వైఎస్ షర్మిల అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ కల్తీపై శ్రీవారి భక్తులు ఆందోళనలో ఉన్నారని,ఆందోళనలో ఉన్న కోట్లాది మంది భక్తులకు నిజానిజాలు వెల్లడవుతాయని ఆమె పేర్కొన్నారు .
కల్తీ ఎలా జరిగింది ? ఎక్కడ జరిగింది ? పాల్పడ్డ దొంగలు ఎవరు ? అన్నది బయటకు రావాలన్నారు.
తిరుమల లడ్డూ విషయంలో అనేక సందేహాలకు సమాధానం కావాలి
అంతేకాదు తక్కువ ధరకు కాంట్రాక్టు ఇవ్వడం వెనుక కారణం ఏంటి ? NDDB రిపోర్ట్ ను ఎందుకు ఇంతకాలం దాచిపెట్టారు ? అనే విషయాలు కూడా బయటకు రావాలన్నారు. తిరుమల లడ్డూ వివాదంలో మత రాజకీయాలకు ఆజ్యం పోసింది ఎవరు ? ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానం దొరకాల్సిన అవసరం ఉందన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడాల్సిన అవసరం ఉందని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు.
లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి
దెబ్బతిన్న హిందువుల మనోభావాలు మీకు ముఖ్యం అనుకుంటే కూటమి సర్కార్ ఈ పని చెయ్యాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. మత రాజకీయాలు మీ అజెండా కాకపోతే లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
సుప్రీం విచారణలో చంద్రబాబు పై తీవ్ర వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే నేడు సుప్రీం ధర్మాసనం తిరుమల లడ్డు కల్తీపై చేపట్టిన విచారణలో అనేక కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల లడ్డు ప్రసాదం వివాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలు ఉన్నాయా.?అంటూ ప్రశ్నించింది. కనీసం దేవుడిని అయినా రాజకీయాలకు దూరంగా ఉంచమని సూచించింది.












Click it and Unblock the Notifications