సుప్రీంలో జగన్ సర్కారుకు ఊరట- స్వర్ణప్యాలెస్ కేసులో దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్
విజయవాడలోని స్వర్ణప్యాలెస్లో నిర్లక్ష్యంగా కోవిడ్ సెంటర్ నడిపి 10 మంది రోగుల చావుకు కారణమైన రమేష్ ఆస్పత్రిపై దర్యాప్తు విషయంలో జగన్ సర్కారుకు ఊరట లభించింది. ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగకుండా గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు ఇవాళ సస్పెండ్ చేసింది. ఈ కేసులో రమేష్ ఆస్పత్రి ప్రభుత్వం నిర్వహించే దర్యాప్తుకు సహకరించాలని సుప్రీంకోర్టు తమ ఆదేశాల్లో పేర్కొంది.
విజయవాడ స్వర్ణప్యాలెస్లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో రమేష్ ఆస్పత్రి నిర్వహిస్తున్న చికిత్స పొందుతున్న కోవిడ్ రోగుల్లో 10 మంది చనిపోయారు. ఈ ఘటనపై అప్పట్లో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పోలీసులు రమేష్ ఆస్పత్రి ఉద్యోగులతో పాటు ఎండీ రమేష్ బాబుపైనా కేసులు నమోదు చేశారు. ఆయన్ను విచారించేలోపే పరారైనట్లు పోలీసులు ప్రకటించారు.
చివరికి ఆయన హైకోర్టును ఆశ్రయించారు. రమేష్ ఆస్పత్రి పెట్టుకున్న పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ కేసులో తదుపరి దర్యాప్తును నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. స్వర్ణప్యాలెస్ ఘటనలో ప్రభుత్వ పాత్ర కూడా ఉందని, అధికారులను ఎందుకు బాధ్యుల్ని చేయలేదంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలువురు అధికారులపై చర్యలు తీసుకుంది. విజయవాడలో ప్లైవేటు కోవిడ్ సెంటర్లను మూసేసింది.
Recommended Video
అయితే హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు దర్యాప్తును ముందుకు సాగేలా ఆదేశాలు జారీ చేసింది. రమేష్ ఆస్పత్రి ఎండీ రమేష్బాబుపై మాత్రం కస్టోడియల్ విచారణ చేయొద్దని మాత్రం ఉత్తర్వుల్లో పేర్కొంది. హైకోర్టులో తదుపరి విచారణ కొనసాగించాలని తెలిపింది. ప్రమాదంపై దర్యాప్తు నిలిపివేయాలనడం సరికాదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. దీంతో ఈ విచారణ ముగిసిస్తున్నట్లు జస్టిస్ నారిమన్ ధర్మాసనం తెలిపింది.