ఇక సుప్రీంలో తేలనున్న 'ఓటుకు నోటు'.. విచారణకు ఓకె.. బాబుకు నోటీసులు..
సోమవారం నాడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్ సుప్రీం ముందుకు రాగా.. దాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి 'ఓటుకు నోటు' కేసును ఎట్టిపరిస్థితుల్లోను వదిలిపెట్టేలా లేరు. తొలుత దీనిపై హైకోర్టును ఆశ్రయించిన ఆయన.. అక్కడ ప్రతికూలంగా తీర్పు రావడంతో ఆ తర్వాత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో సోమవారం నాడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్ సుప్రీం ముందుకు రాగా.. దాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ చేసిన కోర్టు.. వీలైనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. కేసును సమగ్రంగా విచారిస్తామని పేర్కొంది.
చంద్రబాబు నాయుడుకు ఓటుకు నోటు కేసులో ప్రత్యక్ష ప్రమేయముందని ఆళ్ల రామకృష్ణా రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. చంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, గతంలో ఇదే కేసు విషయమై ఆళ్ల రామకృష్ణా రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. చంద్రబాబు పాత్రపై విచారణ అవసరం లేదన్న ఆయన తరపు న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవిస్తూ.. ఏసీబీ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టులో చుక్కెదురవడంతో తిరిగి ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.