జైలుకు తప్పదు!: ఏపీ పోలీస్ బాస్లపై సుప్రీం సీరియస్
న్యూఢిల్లీ: హైదరాబాదును ప్రత్యేక జోన్గా పరిగణించి ఇన్స్పెక్టర్ స్థాయి నుండి ఎస్పీ స్థాయి వరకు పదోన్నతులు ఇవ్వాలనే తమ ఆదేశాలను అమలు చేయక పోవడంపై సుప్రీం కోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త ఆంధ్రప్రదేశ్కు డీజీపీగా ఉన్న జేవీ రాముడు, అవిభాజ్య ఏపీకి డీజీపీగా చేసిన ప్రసాద రావు, అవిభాజ్య రాష్ట్రంలో హోంశాఖ కార్యదర్శిగా చేసిన టీపీ దాస్లపై కోర్టు ఉల్లంఘన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
హైదరాబాద్ జోన్లో పోలీసులకు పదోన్నతులు ఇవ్వాలంటూ 2009లో జారీ చేసిన ఆదేశాలను అమలు చేయనందుకు రాష్ట్ర పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి నిర్లక్ష్యాన్ని తీవ్ర పదజాలంతో తప్పుపట్టింది. హైదరాబాద్ జోన్ పరిధిలో పోలీసులకు ఇన్స్పెక్టర్లు, డీఎస్పీలు, ఏఎస్పీలు, ఎస్పీలుగా పదోన్నతులు కోరుతూ 2002లో జి అనంత రెడ్డి అనే పోలీసు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
దీనిపై అదే ఏడాది అక్టోబర్ 9న సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ రేంజ్ నుంచి హైదరాబాద్ సిటీని వేరు చేసి ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేసి, జోన్లో పోలీసులకు పదోన్నతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ, ఈ ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయలేదు. దీంతో అనంత రెడ్డి సుప్రీంను ఆశ్రయించి ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ ఏడాది మార్చి 31 నాటికి పదోన్నతులు కల్పిస్తామని జనవరిలో రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ కార్యదర్శి, డీజీపీ హామీ ఇచ్చారు. కానీ, గడువు దాటినప్పటికీ ఆ హామీని అమలు చేయలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ హోం శాఖ కార్యదర్శి, డీజీపీ తమ ముందు హాజరు కావాలని మే రెండవ వారంలో ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ఆ బాధ్యతలు చేపట్టిన ప్రసాద రావు, జేవీ రాముడుతోపాటు ప్రతివాదిగా ఉన్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీజీ టీపీ దాస్ సోమవారం జస్టిస్ జగదీశ్ సింగ్ కెహర్, జస్టిస్ ఆర్కే అగర్వాల్తో కూడిన ధర్మాసనం ముందు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ తరపున సీనియర్ న్యాయవాది అల్తాఫ్ అహ్మద్ వాదనలు వినిపించారు. ఇన్స్పెక్టర్లు, డీఎస్పీల పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించామని, ఈ మేరకు ప్రభుత్వం రెండు ఉత్తర్వులను కూడా విడుదల చేసిందని చెప్పారు. సీనియారిటీపై తాత్కాలిక జాబితాలను కూడా సిద్ధం చేశామని వెల్లడించారు. అయితే, జూన్ 2న రాష్ట్ర విభజన జరిగిందని, ఉద్యోగుల పంపిణీ నేపథ్యంలో పదోన్నతులు నిలిచిపోయాయని వెల్లడించారు. ఇలాంటప్పుడు పదోన్నతులు ఇవ్వటం సరికాదని తెలిపారు.
రాష్ట్ర విభజన కంటే ముందుగానే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని తాము ఆదేశించామని జస్టిస్ కెహర్ గుర్తు చేశారు. అసలు తాము జారీ చేసిన ఆదేశాలను అధికారులు చదివారా? లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సిటీని ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేసి, పోలీసు సిబ్బందికి ఇన్స్పెక్టర్లు, డీఎస్పీలు, ఏఎస్పీలు, ఎస్పీలుగా పదోన్నతులు ఇవ్వాలని తాము అందులో పేర్కొన్నామని గుర్తు చేశారు. ఆ ఆదేశాల మేరకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
ఒకవేళ ఆదేశాలకు అనుగుణంగా సీనియారిటీ జాబితాలను తయారు చేస్తే వాటిని చూపించాలని, ఆ జాబితాలపై సిబ్బంది నుంచి వచ్చిన అభ్యంతరాలు ఎన్ని? ఆ అభ్యంతరాల్లో పరిష్కరించినవి ఎన్ని? తిరస్కరించినవి ఎన్ని? తుది జాబితాలో ఎంత మంది ఉన్నారు? తుదిగా ప్రమోషన్లు ఇచ్చేందుకు డీపీసీని ఏర్పాటు చేశారా లేదా? పదోన్నతులు ఇచ్చారా లేదా? అని ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్ల ప్రకారం తాత్కాలిక జాబితాలు కూడా సిద్ధం చేయలేదని అర్థమవుతోందని జస్టిస్ కెహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications