చంద్రబాబు బెయిల్ రద్దుపై తేల్చబోతున్న సుప్రీంకోర్టు..!
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష నేత చంద్రబాబుపై ఇప్పటికే సీఐడీ నమోదు చేసిన కేసులు, వాటిలో బెయిళ్ల వ్యవహారం మరోసారి తెరపైకి వస్తోంది. ఇప్పటికే హైకోర్టు మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా.. వాటిలో ఒక్కో కేసులో వాటి రద్దు కోరుతూ ప్రభుత్వం న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో గతంలో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం రూపొందించిన అలైన్ మెంట్ లో మార్పులు చేసిన విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని సీఐడీ ఆరోపిస్తోంది. ఇదే అంశంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణపైనా కేసులు నమోదు చేసింది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది. ఈ కేసులో చంద్రబాబు కు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంకోర్టు కూడా సమర్ధిస్తే సరి. లేకపోతే మాత్రం వరుసగా మిగతా కేసుల్లోనూ ఆయన బెయిళ్లను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. దీంతో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కీలకంగా మారింది.












Click it and Unblock the Notifications