సుప్రీం కోర్టులోనే 'క్షమాపణ': రోజాపై టిడిపి పైచేయి, స్పీకర్ ఏం చేస్తారు?
అసెంబ్లీలో సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు గాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా ఎట్టకేలకు క్షమాపణ పత్రం ఇచ్చారు.
అమరావతి: అసెంబ్లీలో సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు గాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా ఎట్టకేలకు క్షమాపణ పత్రం ఇచ్చారు. కోర్టుకు వెళ్లిన ఈ ఘటనలో ఓ విధంగా తెలుగుదేశం పార్టీ పైచేయి సాధించిందని చెప్పవచ్చు.
జా! హైకోర్టులోనే తేల్చుకోండి: స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
రోజా క్షమాపణ చెపితే సభలోకి రానిస్తామని టిడిపి నేతలు చెప్పగా, తాను తప్పు చేయలేదని క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని రోజా తొలుత చెప్పారు. ఆ తర్వాత కమిటీ ఎదుట ఆమె క్షమాపణ చెప్పారు. కానీ బయటకు వచ్చి మాత్రం రివర్స్ గేర్ వేశారని టిడిపి చెప్పింది.
క్షమాపణ లేఖపై వాగ్యుద్ధం
రోజా కమిటీ ఎదుట క్షమాపణ లేఖ ఇచ్చారని, టిడిపి నేతలు చెప్పగా, తాను క్షమాపణలు చెప్పలేదని, చెప్పబోనని రోజా ఆ తర్వాత అన్నారు. సిఎంపై చేసిన వ్యాఖ్యలకు స్పీకర్కు కూడా క్షమాపణ లేఖ ఇచ్చారు. మరోవైపు, ఆమెపై బహిష్కరణ గడువు ముగిసిన అనంతరం సభలోకి అనుమతించారు. కానీ ఇప్పుడు సుప్రీం సమక్షంలోనే క్షమాపణ లేఖ ఇచ్చారు. కోర్టు కంటే ముందు కమిటీ ఎదుటనే క్షమాపణపై టిడిపి, వైసిపిల మధ్య వాగ్యుద్దం నడిచింది.
ఏం జరిగిందంటే..?
చంద్రబాబుపై సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారని చెబుతూ ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. దీనిపై ఆమె హైకోర్టుకు వెళ్లారు. తొలుత హైకోర్టు పిటిషన్ స్వీకరించలేదు. సుప్రీం సూచనలతో హైకోర్టు ఆ తర్వాత పిటిషన్ స్వీకరించింది. తొలుత హైకోర్టు బెంచ్లో రోజాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిని ప్రభుత్వం డివిజన్ బెంచ్లో సవాల్ చేసింది. అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు పరిధిలో నడుస్తోంది. హైకోర్టులో పెండింగులో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని సుప్రీం గురువారం తేల్చి చెప్పింది.
Recommended Video
అక్కడే లేఖ
రోజాను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన అంశంపై దాఖలైన పిటిషన్పై సుప్రీం గురువారం విచారణ జరిపింది. విచారణ సమయంలో రోజా ఇప్పటికే క్షమాపణ చెప్పారని, లేఖ కూడా పంపారంటూ ఆమె తరఫున న్యాయవాదులు సుప్రీంకు చెప్పగా.. తమకు అందలేదని ప్రభుత్వం తరఫున లాయర్లు చెప్పారు. దీంతో ఆ క్షమాపణ లేఖను ఇప్పుడు ఇవ్వగలుగుతారా? అని రోజా న్యాయవాదులను సుప్రీంకోర్టు అడగగా.. ప్రభుత్వ న్యాయవాదికి ఈ రోజు న్యాయస్థానం సమక్షంలోనే లేఖ ఇచ్చారు.
సంబంధిత శాఖలకు పంపి..
ఈ లేఖను సంబంధిత శాఖలు, అధికారులకు పంపాలని ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టులో కేసు ముగిసిన తర్వాత మాత్రమే తాము విచారణకు స్వీకరిస్తామని మరోసారి స్పష్టం చేసింది. కాగా, ఇప్పటికే రోజా సస్పెన్షన్ గడువు ముగిసింది. సమావేశాలకు ఆమెను అనుమతిస్తున్నారు. ఒకవేళ సస్పెన్షన్ పొడిగించాలనుకున్నా.. కోర్టు రోజాకు అనుకూలంగా చెప్పినా, క్షమాపణ లేఖపై స్పీకర్ విచక్షణాధికారం కూడా ఉంటుందని, ఆయన ఏం చేస్తారనేది తెలియాల్సి ఉందంటున్నారు.