హైదరాబాద్లో ఏపీ ఉన్నత విద్యామండలికి సుప్రీం పచ్చజెండా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కేసు పైన బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రాంతానికి ప్రవేశ పరీక్షలు ఏపీనే నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ తరఫున పీవీ రావు, బసవ పాటిల్ వాదనలు వినిపించారు. తెలంగాణ రాష్ట్రం తరఫున కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.
ఏపీ ఉన్నత విద్యామండలి పైన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో, ఇరువైపుల వాదనలు విన్న సుప్రీం కోర్టు ఏపీ ఉన్నత విద్యామంలి కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో ప్రవేశ పరీక్షలు నిర్వహించుకోడానికి కూడా అనుమతి ఇచ్చింది.
ఏపీ ఉన్నత విద్యా మండలి ఉనికిలో లేదన్న హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లో కేంద్ర ప్రభుత్వం భాగస్వామి కావాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఏపీ ఉన్నత విద్యా మండలిపై కొద్దిరోజుల క్రితం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బుధవారం సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. విభజన చట్టాన్ని పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పు ఇచ్చిందని, దీని ప్రభావం ఇతర సంస్థలపై పడుతుందని ఏపీ తరఫు న్యాయవాది పీపీరావు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.