కుండబద్దలు కొట్టిన పేరెంట్స్.. ఇంగ్లీష్ మీడియంకే జై.. జగన్కే జనామోదం..
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యపై చాలాకాలంగా వివాదం నడుస్తోంది. పేద,మధ్యతరగతి వర్గాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన.. భవిష్యత్తులో వారికి విస్తృత అవకాశాలు కల్పిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రతిపక్షాలు,భాషాభిమానులు మాత్రం ఇది తెలుగు తల్లికి ద్రోహం చేయడమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చివరకు ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేసి సఫలీకృతులయ్యారు. అయితే పేద వర్గాలకు ఇంగ్లీష్ మీడియం బోధనపై పట్టుదలతో ఉన్న ప్రభుత్వం.. తమ నిర్ణయానికి జనామోదం ఉన్నదని నిరూపించే ప్రయత్నం చేస్తోంది.
Recommended Video
వాలంటీర్ల సర్వే..
తమ పిల్లలు ఏ మీడియంలో చదవాలో నిర్ణయించుకునే హక్కు తల్లిదండ్రులకే ఉందని హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. జన బాహుళ్యంలోనే విషయాన్ని తేల్చుకోవాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం వాలంటీర్ల ద్వారా ఓ సర్వే నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు మూడు ఆప్షన్లు ఇచ్చి.. వారి నుంచి లిఖితపూర్వక అభిప్రాయాలను సేకరించారు.
ఇంగ్లీష్ మీడియంకే జై..
ఈ సర్వేలో 1. ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తూ, తెలుగు తప్పనిసరి సబ్జెక్టు 2. తెలుగు మీడియం 3. ఇతర భాషా మీడియం అనే మూడు ఆప్షన్లను విద్యార్థుల తల్లిదండ్రుల ముందు పెట్టారు. వాటిపై తల్లిదండ్రులు, స్వేచ్ఛగా టిక్చేసి, సంతకాలు చేశారు. మొత్తంగా 96.17శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీషు మాధ్యమమే కావాలని మొదటి ఆప్షన్ ద్వారా స్పష్టం చేశారు. ఈ విద్యా సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకూ 17,87,035 మంది విద్యార్థులు ఉంటే.. 17,85,669 మంది తల్లిదండ్రులు తమ ఐచ్ఛికాన్ని తెలియజేస్తూ సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపారు.
హైకోర్టు కొట్టేసినా.. నైతిక మద్దతు జగన్కే..
ఇక తెలుగు మీడియంలోనే బోధన కావాలని కోరుకున్న తల్లిదండ్రులు కేవలం 3.05శాతం మాత్రమే. ఇతర భాషా మీడియం కోరుకున్న వారు 0.78 శాతం. ఏప్రిల్ 29 వరకు వచ్చిన వివరాల ప్రకారం ఈ గణాంకాలు నమోదు చేశారు. తమ పిల్లలు ఏ మీడియంలో చదువుకోవాలని అత్యధిక మంది తల్లిదండ్రులు భావిస్తున్నారో ఈ సర్వే ద్వారా వెల్లడైంది. హైకోర్టు తమ నిర్ణయాన్ని కొట్టిపారేసినా.. ప్రజల నైతిక మద్దతు మాత్రమే తమకే ఉందని దీని ద్వారా నిరూపించుకుంటోంది.