ఆమెపై అనుమానంం: కూలికొచ్చి అఫైర్ నడిపి, చివరకు చంపేశాడు
అనంతపురం: ఓ వ్యక్తి అనుమానంతో తన ప్రేయసిని అత్యంత దారుణంగా హత్య చేసిన కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం పోలీసు స్టేషన్ పరిధిలో ఆ సంఘటన చోటు చేసుకుంది.
శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్మవరం ఇన్చార్జి డీఎస్పీ రామవర్మ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జ్యోతి అనే మహిళను ఆమె ప్రియుడు నాగముని దారుణంగా హత్య చేసిన ఉదంతాన్ని వివరించారు.
ఇలా వారిద్దరి మధ్య ప్రేమ
పనార్పలలోని చౌడమ్మ కట్ట వద్ద నివసిస్తున్న పెరవని జ్యోతి భర్త రామకృష్ణ 8 నెలల క్రితం మరణించాడు. జ్యోతి నార్పలలోని తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుండేది. బుక్కరాయసముద్రం మండలం సంజీవపురం గ్రామానికి చెందిన కిల్లా నాగముని.. జ్యోతి పొలంలోకి కూలికొచ్చేవాడు.
ఇలా వివహేతర సంబంధం
జ్యోతితో పరిచయం పెంచుకుని నాగముని లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. అయితే జ్యోతి తన చిన్నమామ కొడుకు ముత్యాలప్పతో వివాహేతర సంబంధం పెట్టుకుందని నాగముని అనుమానిస్తూ వచ్చాడు. ఇదే విషయమై ఆమెతో తగాదా పడుతూ వచ్చాడు. దాంతో జ్యోతిని హత్య చేయాలని అనుకున్నాడు.
ఫోన్ చేసి బస్సు నుంచి దింపి
డిసెంబర్ 7న ధర్మవరం పట్టణంలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చిన జ్యోతి తిరిగి నార్పలకు బస్సులో బయలుదేరింది. ఆ విషయం తెలుసుకున్న నాగముని ఆమెకు ఫోన్ చేసి, బొందలవాడ గ్రామ సమీపంలోని సత్య సాయి వాటర్ప్లాంటు వద్ద దిగాలని చెప్పాడు. ఆమెను తన ద్విచక్ర వాహనంలో జ్యోతిని ఎక్కించుకుని బొందలవాడ-సంజీవపురం కెనాల్ రోడ్డు వద్దకు తీసుకెళ్లి, గూని వంక బ్రిడ్జి వద్ద వాహనాన్ని ఆపాడు.
చీర కొంగుతో ఉరేసి...
జ్యోతితో వాగ్వివాదానికి దిగిన నాగముని చీరకొంగుతోనే జ్యోతి గొంతు బిగించి, చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని గోనె సంచిలో కట్టేసి, కాలువలో పడేసి వెళ్లిపోయాడు. ఇంటికి చేరుకున్న నాగముని వాహనాన్ని అక్కడ ఉంచి పారిపోయాడు. గురువారం కాలువలో జ్యోతి శవం కనిపించటంతో పోలీసులు పట్టుకుంటారనే భయంతో నార్పల వీఆర్ఓ రవి సమక్షంలో ధర్మవరం పోలీసుల వద్ద లొంగిపోయాడు.