ఎప్పుడు.. ఎలా ముగింపు పలకాలో నాకు తెలుసు: ఛార్జిషీట్ వార్తలపై ఏబీ వెంకటేశ్వర రావు
అమరావతి: తనపై ఛార్జిషీట్ను నమోదు చేయాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించినట్లు వస్తోన్న వార్తలపై సస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చినట్లు గా చెబుతున్న లేఖ పాలనా ప్రక్రియలో భాగం మాత్రమేనని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం ఏదని అన్నారు. ఈ మేరకు ఆయన తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు ఓ లేఖ రాశారు.
ఈ ఆదేశాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం తన మీద మోపిన ఆరోపణలు నిజమని కేంద్రం నమ్ముతున్నట్లు కాదని అన్నారు. అలా నమ్ముతున్నట్లుగా వస్తోన్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. విచారణ జరక్కుండా నిజానిజాలు తేలవని, విచారణలో భాగంగా కేంద్రం ఈ ఆదేశాలను జారీ చేసిందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తనపై ఛార్జిషీట్ను నమోదు చేయడానికి ఏప్రిల్ 7వ తేదీ వరకు గడువు ఇవ్వడం దీనికి నిదర్శనమి అన్నారు. తన మీద, తన వ్యక్తిత్వం మీద చోటు చేసుకుంటున్న దుష్ప్రచారానికి ఎప్పుడు ఎలా ముగింపు పలకాలో తనకు తెలుసునని, సరైన సమయంలో సరైన సమాధానం ఇస్తానని అన్నారు.
అఖిల భారత సర్వీసు అధికారులను ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసినప్పుడు కేంద్రానికి నివేదించడం తప్పనిసరి అవుతుందని, ఆ నివేదిక ఆధారంగా కేంద్రం ఆ సస్పెన్షన్ను ఆమోదించవచ్చు లేదా ఆమోదించకపోవచ్చని చెప్పారు. కేంద్రం ఆమోదించకపోతే సస్పెన్షన్ రద్దు కాదని, అయినప్పటికీ.. సస్పెండ్ చేసిన 30 రోజుల్లోగా క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన ఛార్జిషీట్ను అందజేయలేకపోతే సస్పెన్షన్ రద్దవుతుందని వివరించారు.












Click it and Unblock the Notifications