సంక్రాంతికి పందెం కోళ్లు రెడీ- అనుమతులపై మరోసారి ఉత్కంఠ- ఈసారి కారణాలివే
ఏపీలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే సంప్రదాయ కోడి పందాలకు రంగం సిద్దమవుతోంది. సంక్రాంతి కోసం ఏడాది పొడవునా పెంచిన కోళ్లను వాటి యజమానులు సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో జీవహింస పేరుతో వీటికి అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వాలు, కోర్టులు నిరాకరించేవి. కానీ ఈసారి మరో కారణం కనిపిస్తోంది. కరోనా కారణంగా ఈసారి సంక్రాంతి కోడి పందాలకు అనుమతులు లభిస్తాయా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. అయితే అనుమతులతో సంబంధం లేకుండానే గ్రామీణ ప్రాంతాల్లో సాగే ఈ పందాలను ఎలాగైనా నిర్వహించి తీరాలని పందెం రాయుళ్లు పట్టుదలగా ఉన్నారు.
హైదరాబాద్-విజయవాడ- సంక్రాంతి స్పెషల్ విమానాలు- గంట సేపు ప్రయాణం
సంక్రాంతి సంప్రదాయంగా కోడి పందాలు
ఏపీలోని గోదావరి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సంక్రాంతి సందర్భంగా నిర్వహించే సంప్రదాయ కోడి పందాలకు గొప్ప చరిత్రే ఉంది. శతాబ్దాల క్రితమే మొదలైన ఈ కోడి పందాలను సంక్రాంతిలో ఇతర వేడుకలు, వంటకాలతో పాటు ఓ భాగంగా జనం భావిస్తుంటారు. ఇక్కడి ప్రజలు కోడి పందాల కోసం ఏర్పాట్లు చేసుకుంటుంటే వాటిని చూసేందుకు ఇతర ప్రాంతాల జనం కూడా తరలిరావడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఎక్కడెక్కడ నుంచో జనం గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కోడి పందాలు చూసేందుకు తరలివస్తుంటారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రతీ ఏటా భీమవరంలో కోడి పందాలకు హాజరవుతారు.
ఈసారి సంక్రాంతికీ కోళ్లు, బరులు రెడీ...
ఎప్పటిలాగే ఈసారి కూడా సంక్రాంతికి కోళ్ల బరులు సిద్దమైపోతున్నాయి. సంక్రాంతి కోళ్లు రెడీ అయిపోయాయి. ఇక పందాలు మొదలవడమే తరువాయి అన్నట్లుంది.. ఇప్పటికే గోదావరి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో సంక్రాంతి కోడి పందాలను భారీ స్ధాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. నిర్వాహకులు భారీ టెంట్లు సిద్దం చేసుకుంటుంటే, బెట్టింగ్ రాయుళ్లు డబ్బులు సిద్దం చేసుకుంటున్నారు. కోళ్ల యజమానులు ఇప్పటికే సిద్ధం చేసిన పుంజుల్ని ఎప్పుడెప్పుడు బరిలోకి దింపాలా అని ఎదురుచూస్తున్నారు. దీంతో మరోసారి సంక్రాంతి కోడి పందాలు ఉత్కంఠ భరితంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కోడి పందాలపై కరోనా ప్రభావం
ప్రతీ ఏటా సంక్రాంతి కోడి పందాలకు ప్రభుత్వాలు, కోర్టుల నుంచి ఆంక్షలు ఉండేవి. చివరికి కోళ్లకు కత్తులు కట్టకుండా పందాలు నిర్వహించుకోవచ్చని అనుమతులు ఇచ్చేవారు. కానీ ఈసారి కరోనా ప్రభావంతో రాష్ట్రం సతమతమైంది. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలోలా కోడి పందాలకు అనుమతులు ఇస్తారా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా జనం ఎక్కువగా టెంట్లలో గుమికూడి నిర్వహించుకునే కోడి పందాలకు అనుమతులు ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకూ స్ఫష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో చివరి నిమిషంలో అనుమతులు ఇస్తే ఏర్పాట్ల సంగతేంటని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటివకే రద్దయిన న్యూ ఇయర్ వేడుకలు
ఇప్పటికే కరోనా ప్రభావంతో కొత్త ఏడాది వేడుకలు నిర్వహించకుండా ప్రభుత్వం, పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టారు. కరోనా సెకండ్ వేవ్ భయాలతో ప్రభుత్వం ఆంక్షల మధ్యే వేడుకలు నిర్వహించుకునేలా షరతులతో అవకాశం ఇచ్చింది. కానీ కోడి పందాలు బహిరంగంగా జరిగే కార్యక్రమం కాబట్టి దీనికి అనుమతి ఇస్తారా లేదా అన్నది తెలియడం లేదు. కొత్త ఏడాది తరహాలోనే కోడి పందాలపై ఆంక్షలు విధించడం లేదా పూర్తిగా రద్దు చేయడం చేస్తే మాత్రం ఈసారి నిర్వాహకులకే కాదు బెట్టింగ్ రాయుళ్లకు, పందాల అభిమానులకు సైతం నిరాశ తప్పకపోవచ్చు.