అమరావతి కేసు విచారణ-సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ ? ఫాస్ట్ ట్రాక్ విజ్ఞప్తి, ఫిర్యాదుల నేపథ్యం !
ఏపీలో అమరావతి రాజధానికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ల విచారణ త్వరగా చేపట్టాలన్న జగన్ సర్కార్ విజ్ఞప్తిపై సుప్రీంకోర్టులో సస్పెన్స్ కొనసాగుతోంది.
ఏపీ రాజధానుల వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ పిటిషన్లపై త్వరగా విచారణ చేయాలంటూ వైసీపీ సర్కార్ ఒత్తిడి చేస్తున్నా సుప్రీంకోర్టు మాత్రం తనదైన శైలిలోనే నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పై కోర్టు ధిక్కార ఫిర్యాదులు కూడా వస్తుండటంతో సుప్రీం నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధాని పిటిషన్ల విచారణ ఇవాళ లిస్ట్ చేయాలని ఏపీ సర్కార్ నుంచి వచ్చిన విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

సుప్రీంకోర్టులో అమరావతి కేసు
అమరావతి రాజధానికి అనుకూలంగా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ఇప్పటికే ప్రారంభమైంది. హైకోర్టు గతంలో అమరావతి నిర్మాణం కోసం ఇచ్చిన గడువుల్ని నిలిపేస్తూ సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. అయితే అసలు రాజధాని మార్చే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి ఉందా లేదా అనే అంశంపై మాత్రమే ఇప్పుడు నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఈ ఒక్క విషయం తేలితే మిగతా విషయాలు వాటంతట అవే తేలిపోవడం ఖాయం. దీంతో సుప్రీంకోర్టు దీనిపై ఏం చేయబోతోందనే ఉత్కంఠ పెరుగుతోంది. అయితే రాజధాని తరలింపుకు సమయం తక్కువగా ఉండటంతో సుప్రీంకోర్టును వేగంగా విచారణ పూర్తి చేయాలని జగన్ సర్కార్ కోరుతోంది.

సుప్రీంకు జగన్ సర్కార్ విజ్ఞప్తులు
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తాము దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ త్వరగా పూర్తి చేయాలని జగన్ సర్కార్ సుప్రీంకోర్టును పదే పదే కోరుతోంది. రాజధాని తరలింపుకు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో, వచ్చే ఏడాది ఎన్నికల్ని కూడా దృష్టిలో ఉంచుకని ఈ వ్యవహారం సాధ్యమైనంత త్వరగా తేలిపోతే మంచిదని ప్రభుత్వం కోరుకుంటోంది. దీంతో సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ మెహఫూజ్ నజ్కీసాయంతో సీజేఐ డీవై చంద్రచూడ్ కు, రిజిస్ట్రీకి పలు విజ్ఞప్తులు చేస్తోంది. తాజాగా ఇదే అంశంపై నజ్కీ మరోసారి సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి లేఖ రాశారు. ఇందులో ఫిబ్రవరి 6న అంటే ఇవాళ ఈ పిటిషన్ల విచారణను లిస్ట్ చేయాలని కోరారు. అయితే ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు.

సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ ?
ఏపీ రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ త్వరగా పూర్తి కావాలని జగన్ సర్కార్ కోరుకుంటుండగా.. విచారణ మాత్రం నత్తనడకగానే సాగుతోంది. దీని వెనుక పలు కారణాలు ఉన్నాయి. అలాగే ఈ కేసులో సంక్లిష్టత కూడా మరో కారణం.దీంతో సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం కోరుతున్న విధంగా ఫాస్ట్ ట్రాక్ విచారణకు సిద్ధం కావడం లేదు. తాజాగా మరోసారి ఫాస్ట్ ట్రాక్ విచారణ కోసం జగన్ సర్కార్ చేసిన విజ్ఞప్తిపైనా సుప్రీంకోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో ఇవాళ కూడా విచారణ కష్టంగానే కనిపిస్తోంది. అయితే గత విచారణ సందర్భంగా ఫిబ్రవరి 7కు అంటే రేపటికి ఈ విచారణ వాయిదా పడింది. దీంతో రేపు ఈ విచారణ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత విచారణ సందర్భంగా కూడా ధర్మాసనం బిజీగా ఉంటడంతో విచారణ లిస్ట్ అయినా జరగలేదు. దీంతో రేపు విచారణ తిరిగి ప్రారంభం అవుతుందా లేదా అన్నది తేలడం లేదు.












Click it and Unblock the Notifications