పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో మృతదేహల కలకలం..!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో సంచలన ఘటన చోటు చేసుకుంది. నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద మృతి భయాందోళన కలిగిస్తోంది. ఊరి చివర పొలాల మధ్య ఉన్న బావిలో ఇద్దరి మృతదేహాలు తేలియాడుతూ కనిపించడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘోర దృశ్యం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతులను అదే గ్రామానికి చెందిన రంపం శ్రీను (48), తోలేటి సూరిబాబు (34)లుగా పోలీసులు గుర్తించారు.
ఆర్థిక లావాదేవీలే కారణమా..?
కాగా ప్రాథమిక దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడుగా వారి సమీప బంధువు రంపం గంగాధర్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. గంగాధర్ తన ఇంటి నిర్మాణం కోసం గ్రామంలోని కుంపట్ల సూరిబాబు, రంపం శ్రీను, తోలేటి సూరిబాబు వద్ద అప్పు తీసుకున్నాడు. కానీ ఆ అప్పును తిరిగి చెల్లించే ఉద్దేశం లేకుండా.. అప్పు ఇచ్చిన వారినే చంపేస్తే సమస్య తీరిపోతుందని హత్య ప్రణాళిక రచించాడు.

దారుణ హత్య..
తన ప్లాన్ ప్రకారం మందు పార్టీ ఇస్తానని చెప్పి గంగాధర్.. శ్రీను-సూరిబాబులను పిలిచాడు. వారికి మద్యం పట్టించి, ఫుల్గా తాగిన సమయంలో ఇద్దరినీ దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత వారి మృతదేహాలను తాటిపర్తి కొండ కాలువ వద్ద పొలాల మధ్య ఉన్న బావిలో పడేశాడని భావిస్తున్నారు.
మరో బంధువుపై కూడా పన్నిన పన్నాగం..
ఇదిలా ఉండగా, గంగాధర్ అప్పు తీసుకున్న మరో వ్యక్తి కుంపట్ల సూరిబాబును కూడా హత్య చేయాలనే యత్నం చేశాడట. సూరిబాబును సుద్ధగడ్డ వాగులో పడేయాలని ముందుగానే ప్లాన్ చేసిన గంగాధర్.. అంతకు ముందు అతనిపై దాడికి కూడా పాల్పడ్డాడని అంటున్నారు. అయితే అనుమానం వచ్చిన సూరిబాబు అక్కడి నుండి తప్పించుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ హత్యా యత్నం విఫలమైంది.
పోలీసులు దర్యాప్తులో షాకింగ్ నిజాలు..
కాగా సంఘటనా స్థలానికి చేరుకొని ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, పిఠాపురం సీఐ శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్సై రామకృష్ణ, క్లూస్ టీమ్లు మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. సాక్ష్యాధారాల ఆధారంగా, ఈ హత్యల వెనుక ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రంపం గంగాధర్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications