విఆర్వో అనుమానాస్పద మృతి...పొలాల్లో అర్థనగ్నంగా పడి వున్న మృతదేహం
అమరావతి: రాజధాని పరిధిలో వీఆర్వోగా పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి పొలాల్లో శవమై పడిఉండటం సంచలనం సృష్టించింది. అతడు రాజధాని పరిధిలోని గ్రామంలో విఆర్వోగా పనిచేస్తుండటం, విఆర్వో చనిపోయాడు అక్కడకు వెళ్లి చూడండంటూ ఒక మహిళ స్థానికులకు చెప్పి వెళ్లిపోవడం, ఆమె చెప్పిన చోట అతడి మృతదేహం అర్థనగ్నంగా పడివుండటం, అతడి ఫ్యాంట్ పక్కనే పత్తి మొక్కపై పడివుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.
గుంటూరు జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటన వివరాలు... మేడికొండూరు మండలంలోని మందపాడు గ్రామంలో పొలాల్లో పనిచేస్తున్న రైతుల వద్దకు ఒక మహిళ వచ్చి అక్కడ పొలాల్లో విఆర్వో చనిపోయి పడివున్నాడని చెప్పి గాభరాగా వెళ్లిపోయింది. దీంతో రైతులు ఆమె చెప్పిన వైపు వెళ్లి వెతుకగా పత్తి పొలంలో ఒక వ్యక్తి మృతదేహం కనిపించింది.
ఆ తరువాత ఆ మృతదేహం తాడికొండ మండలం రావెల గ్రామం విఆర్వో తురకపల్లి శ్రీనివాసరావుదిగా గుర్తించారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం విఆర్వో శ్రీనివాసరావు శనివారం సాయంత్రం ఓ బైక్ పై మహిళతో కలసి మందపాడు పొలాల వైపు వచ్చాడు.ఆ తరువాత అతడు బైక్ ను రోడ్డు పక్కనే ఉంచి మహిళతో కలసి ఏపుగా పెరిగిన పత్తి పొలాల్లోకి వెళ్లాడు. కొద్ది సేపటి అనంతరం ఆ మహిళ తిరిగి వచ్చి విఆర్వో చనిపోయినట్లు రైతులకు చెప్పినట్లు తెలిసింది.

ఎన్నో అనుమానాలు...
అయితే ఆ కొద్ది సేపట్లో ఏం జరిగి వుంటుందనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్న విఆర్వో ఆమెతో కామ వాంఛ తీర్చుకునేందుకు పొలాల్లోకి తీసుకురాగా ఆ సమయంలో గుండెపోటుకు గురై మృతిచెంది ఉండొచ్చని కొందరు అంటుండగా మరి కొందరు అతడు రాజధాని ప్రాంత విఆర్వో అయినందున ఆ మహిళే ఏమైనా చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనా విఆర్వో మృతి వెనుక మిస్టరీ వీడాలంటే అతడితో కలసి వచ్చిన ఆ మహిళను గుర్తించాల్సివుంది. ఇక ఆ మహిళ ఎవరనే విషయంపై కూడా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇతడికి మరో మహిళా విఆర్వోతో వివాహేతర సంబంధం ఉందని, ఆమె ఇతడితో కలసి ఇక్కడకు వచ్చి ఉండొచ్చని అంటున్నారు. మృతుడి భార్య తురకపల్లి కుమారి తన భర్తకు శత్రువులు ఎవరూ లేరని ఎలా చనిపోయాడో పోలీసులే తేల్చాలని వేడుకుంటున్నారు.
తన భర్త 40 రోజులు అయ్యప్పమాల ధరించి శబరిమల వెళ్లి శుక్రవారమే విధుల్లో చేరాడని, 24 గంటలు గడవక ముందే శవమై కనిపించాడని కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టుంకి పంపారు. చనిపోయే కొద్దిసేపటిముందు వరకు విధుల్లోనే ఉన్న విఆర్వో అంతలోనే శవంగా మారటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications