అఖిలప్రియపై మా చిన్నాన్నను పోటీ చేయించమన్నారు: జగన్పై ఎస్వీ ఫైర్
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు శాసనసభ్యుడు ఎస్వీ మోహన్ రెడ్డి ప్రకటించారు. శనివారం ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ఆయన టిడిపిలో చేరనున్నారు.
తాను వైసిపిని వీడి టిడిపిలో చేరుతున్న విషయాన్ని ప్రకటిస్తూ వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తన సోదరి శోభా నాగిరెడ్డి మరణించి కొద్ది రోజులే అవుతోందని, అటువంటి స్థితిలో అఖిలప్రియపై తమ చిన్నాన్న ఎస్వీ నాగిరెడ్డిని పోటీ చేయించాలని జగన్ తనను అడిగారని, తాను ఆ పని చేయలేనని ఆయన అన్నారు.

వైసిపిని వీడడానికి అనేక కారణాలున్నాయని ఆయన చెప్పారు. తాను కర్నూలులో చేపట్టే ధర్నా గురించి జగన్ తమకు తెలియజేయలేదని ఆయన విమర్శించారు. టిడిపిలో చేరడానికి తాను డబ్బులు తీసుకుంటున్నట్లు చేసిన విమర్శలను ఆయన ఖండించారు. కాంగ్రెసులో ఎమ్మెల్సీగా ఉంటూ తాను వైసిపిలో చేరానని, ఆ సమయంలో తనకు ఎంత డబ్బు ఇచ్చారని అన్నారు.
తనపై నమ్మకం ఉంచి ప్రజలు తనను గెలిపించారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయలేక తాను టిడిపిలో చేరుతున్నానని, అధికారంలో లేకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రాలు చేపట్టలేకపోతున్నానని ఆయన అన్నారు. పార్టీల కన్నా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తనకు ప్రధానమని ఆయన చెప్పారు. జిల్లా అభివృద్ధికి, మైనారిటీల అభివృద్ధికి చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications