పృథ్వీపై నిర్భయ కేసు పెట్టాలి.. అఖిల భారత హిందూ మహాసభ డిమాండ్..
ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఓ ఆడియో టేపు కూడా బయటకు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల కొండ మీద పృథ్వీ కామాంధుడిలా వ్యవహరిస్తూ.. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ హిందూ సంఘాలు,పలు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా టీవీ5 మీడియా చానెల్తో మాట్లాడిన అఖిల భారత హిందూ మహాసభ సభ్యుడు,ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి పృథ్వీపై నిర్భయ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. పవిత్రమైన తిరుమల కొండపై పృథ్వీ మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడటాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలన్నారు. తక్షణం అతన్ని పదవి నుంచి తప్పించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు కందారపు మురళి కూడా పృథ్వీపై పలు ఆరోపణలు చేశారు. ఒక ఆధ్యాత్మిక చానెల్కు చైర్మన్గా నియమించేటప్పుడు అతని నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ మహిళా ఉద్యోగి ధైర్యం చేసి పృథ్వీ వ్యవహారాన్ని బయటపెట్టింది కాబట్టి అతని అసలు స్వరూపం బయటపడిందన్నారు. ఇంకా ఎంతమంది మహిళలను అతను వేధించాడోనని అన్నారు. ఎస్వీబీసీలో ఉద్యోగాలను పర్మినెంట్ చేయిస్తానని, వేతనాలు పెంచేలా చేస్తానని చెప్పి పలువురు మహిళలను పృథ్వీ లోబర్చుకునేందుకు ప్రయత్నించినట్టు ఆరోపణలు చేశారు. తిరుమల కొండపై పద్మావతి అతిథి గృహంలోనే అతను మందు కొడుతున్నట్టు కూడా తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాగే టీటీడీ బోర్డుకు తెలియకుండా 36 మందిని దొడ్డిదారిన ఉద్యోగాల్లో నియమించాడని,చివరకు చైర్మన్కు అసలు విషయం తెలిసి వారిలో 30మందిని తొలగించారని చెప్పారు. పృథ్వీని ఆ పదవి నుంచి తప్పించడంతో పాటు అతనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఇక రాష్ట్ర బ్రాహ్మణ కార్పోరేషన్ మాజీ చైర్మన్ సూర్య మాట్లాడుతూ.. ఎస్వీబీసీ చైర్మన్ పదవిలో కొనసాగేందుకు పృథ్వీకి అసలేమాత్రం అర్హత లేదన్నారు. నిజానికి ఆ పదవిలో నియమింపబడేవారు
ఎన్నో విధాలుగా నిష్ణాతులై ఉండాలని, ఏ అర్హత లేనివాడిని తీసుకొచ్చి చైర్మన్ను చేశారని విమర్శించారు. పృథ్వీని ఆ పదవిలో నియమించేటప్పుడే చాలామంది వ్యతిరేకించారని అన్నారు.
ఏమాత్రం భక్తి భావం లేని, పెద్దలంటే గౌరవం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఎస్వీబీసీకి చైర్మన్ను చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా పృథ్వీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించానలి డిమాండ్ చేశారు. మరోవైపు తిరుపతిలోని పలు ప్రజా సంఘాలు,విద్యార్థి సంఘాలు రేపు టీటీడీ పాలకమండలి ముట్టడికి పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. పృథ్వీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీటీడీ పాలకమండలి ఎదుట వారు ధర్నాకు సిద్దమవుతున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications