జగన్ నిర్ణయంపై స్వరూపానంద ఆగ్రహం-వెనక్కి తీసుకోవాలంటూ సీఎంవోతో చర్చలు
ఏపీలో వైసీపీ సర్కార్ తాజాగా బ్రహ్మణ కార్పోరేషన్ ను దేవాదాయశాఖ పరిధి నుంచి తప్పించి బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకి తీసుకుని వచ్చింది. ఈ మేరకు జీవో కూడా జారీ చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. బ్రహ్మణ కార్పోరేషన్ విధులు, వ్యవహారాలు అన్నీ దేవాదాయశాఖతో సంబంధం కలిగినవి కాగా.. ప్రభుత్వం మాత్రం ఎలాంటి సంబంధం లేని బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకి దీన్ని తీసుకుకురావడం చర్చనీయాంశమవుతోంది.
బ్రహ్మణ కార్పోరేషన్ ను బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకి తీసుకురావడంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైన నిర్ణయం కాదంటూ ఆయన ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆయన బ్రహ్మణ కార్పోరేషన్ బీసీ శాఖలోకి మార్చడంపై తన అసంతృప్తిని తెలియజేశారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం తో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఒక ప్రకటనలో స్వామీజీ తెలియజేశారు. దీంతో బ్రహ్మణ కార్పోరేషన్ విషయంలో స్వామి చెప్పినట్లు ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.
మరోవైపు ఇప్పటికే నిధుల కొరత కారణంగా బ్రహ్మణ కార్పోరేషన్ నిర్వహణ విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేవాలయాల నుంచి వచ్చే నిధుల్ని దేవాదాయశాఖ బ్రహ్మణ కార్పోరేషన్ కు కేటాయించాల్సిన పరిస్ధితి తలెత్తుతోంది. అదే బీసీ కార్పోరేషన్ లో ఉంటే అలాంటి ఇబ్బందులు ఉండబోవని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. దీనిపై వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తిరిగి బ్రహ్మణ కార్పోరేషన్ ను దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకురావాలన్న ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా స్వామి స్వరూపానంద అసంతృప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలో ప్రభుత్వం వివిధ కార్పోరేషన్ల తరఫున అప్పులు తీసుకొస్తోంది. ఇదే క్రమంలో బ్రహ్మణ కార్పోరేషన్ ద్వారా కూడా అప్పులు తెచ్చేందుకు వీలుగా బీసీ సంక్షేమ శాఖలో చేర్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం బ్రహ్మణ కార్పోరేషన్ ద్వారా లబ్దిదారులకు మేలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది.