సిరంజీ సైకో దాడికి గురైన మహిళకు నెత్తుటి వాంతులు: మరో దాడి
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో సైకో సూదిగాడి దాడికి గురైన బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది. నల్లజర్లకు చెందిన మహిళకు నెత్తుటి వాంతులయ్యాయి. బాధితురాలిని తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు. పది రోజుల క్రితం మహిళపై సైకో ఇంజక్షన్ దాడి జరిపాడు.
ముక్కు, నోరు నుంచి కూడా రక్తం రావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. గత నెల 20న గంటా చంటి అనే మహిళ నడిచి వెళుతుండగా, మోటారు సైకిల్పై వచ్చిన సూదిగాడు వెనుక నుంచి పొడిచి పరారయ్యాడు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి భయపడాల్సిందే మీ లేదని ఇంటికి పంపించేశారు.
బుధవారం ఆమె ముక్కు, నోటి నుంచి రక్తం రావడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిన్న మొన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న చంటి అనారోగ్యం పాలవడంతో సైకో బాధితులతో పాటు జిల్లావాసుల్లోనూ భయాందోళనలు మొదలయ్యాయి.
ఇదిలావుటే, పశ్చిమగోదావరి జిల్లాలో మరోసారి సైకో కలకలం రేగింది. నర్సాపురం మండలం రాజుల లంకలో ఓ మహిళకు సైకో ఇంజక్షన్ ఇచ్చి పరారయ్యాడు. సైకోను పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. అతని దారణాలు కూడా ఆగడం లేదు.