వెయ్యి కోట్లిస్తే లగడపాటిని చేర్చుకుంటారు: కెసిఆర్పై ఫైర్
వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తే లగడపాటిని కూడా కెసిఆర్ తన పార్టీలో చేర్చుకుంటారన్నారు. తెరాస నీచ రాజకీయాలకు పాల్పడవద్దన్నారు. కోదండరాం వల్లే తెలంగాణ ఉద్యమం బలపడిందని మాజీ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఇంత ఉద్యమానికి కారణం ఆయనే అన్నారు. అలాంటి కోదండరాంను కొండా సురేఖ విమర్శించడం విడ్డూరమన్నారు.
కోదండరాం పైకి కెసిఆరే కొండా దంపతులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. శాంతియుత వరంగల్ను కొండా దంపతులు అల్లకల్లోలం చేసేలా ఉన్నారని ధ్వజమెత్తారు. ఉద్యమకారుల అంతు మీరు చూస్తారా అని కొండా సురేఖను ప్రశ్నించారు.
పొత్తుల పేరుతో తాము సిట్టింగ్ స్థానాలను వదులుకునే ప్రసక్తి లేదని కేంద్రమంత్రి బలరాం నాయక్ చెప్పారు. తనకు వారసత్వ రాజకీయాల గురించి తెలియదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు. ఆమె తలచుకోకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు.