కెసిఆర్పై అరుణ: సోనియాపై జైపాల్ చిదంబర రహస్యం
మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ ప్రాంత నేతలు పొన్నాల లక్ష్మయ్య, డికె అరుణ, జైపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రకటన అనంతరం ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తొలిసారి మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో టి కాంగ్రెసు నేతలు మాట్లాడారు.
ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు సాధారణమైన ఎన్నికలు కావని, తెలంగాణ అభివృద్ధి ఎవరు చేస్తారో గుర్తించాలని డికె అరుణ అన్నారు. తెలంగాణ ఉద్యమం కెసిఆర్ వల్ల పుట్టలేదన్నారు. 1969లో, 2000 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం మహబూబ్ నగర్ జిల్లాలోనే ప్రారంభమైందని చెప్పారు. ఉద్యమాన్ని రెచ్చగొట్టి ప్రజల ప్రాణాలు తీసిన కెసిఆర్ను ఎవరు నమ్మరని తాను భావిస్తున్నానని అన్నారు.
తెలంగాణ సెంటిమెంటుతో రాజకీయ లబ్ధి పొందాలని కెసిఆర్ చూశారన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసును ఆదరించాలని, తెలంగాణ ఆవిర్భావానికి కెసిఆర్ కారణం కాదన్నారు. రెచ్చగొట్టినంత మాత్రాన ప్రజలు కెసిఆర్ను నమ్మరని చెప్పారు. తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెసు ఎఫ్పుడో నిర్ణయించిందని పొన్నాల చెప్పారు. సోనియా చొరవతోనే తెలంగాణ కల సాకారమైందన్నారు. ఎన్నో ఆటంకాలను అధిగమించి ఆమె తెలంగాణ కలను సాకారం చేశారన్నారు.
సామాజిక తెలంగాణ, సుస్థిర పాలన, అభివృద్ధి కాంగ్రెసు పార్టీతోనే సాధ్యమన్నారు. 2004, 2009లో తాము ఇచ్చిన హామీలను 95 శాతం నెరవేర్చామన్నారు. అమరవీరుల కుటుంబాలకు రూ.1000 కోట్లతో నిధులు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తాను పైరవీలు చేశానని జైపాల్ రెడ్డి అన్నారు. రాహుల్ ప్రజాస్వామ్యవాది అని.. నియంత కాదన్నారు. సోనియా తెలంగాణ ఇచ్చారని అందరు అంగీకరించారన్నారు.
తెలంగాణ బిల్లును బిజెపి నేతలు ఖండించారని, అడ్డుకునే ప్రయత్నాలు చేశారన్నారు. తాను ప్రజలకు ఓ చిదంబర రహస్యం చెబుతున్నానని.. సోనియాకు స్ఫూర్తి రాహుల్ గాంధీయే అన్నారు. తెలంగాణ కోసం తాను సోనియా చెవిలో జోరీగలాగా కృషి చేశానన్నారు. తెలంగాణ కోసం తన వంతు పాత్ర పోషించానని చెప్పారు. తెరాస చిల్లర పార్టీ అన్నారు. ఆ దుకాణం ఎప్పుడు మూస్తారో.. ఎప్పుడు తెరుస్తారో కెసిఆర్కే తెలుసునన్నారు.