ఎన్టీఆర్ ట్రస్టు భవన్పై కోడిగుడ్లతో, వెంకయ్య ఇంటిపైనా..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్పై తెలంగాణ న్యాయవాదులు మంగళవారం హైదరాబాదులో దాడి చేశారు. కొడిగుడ్లు, టొమాటోలతో వారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తూ వారు ఈ దాడికి పాల్పడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఇప్పటికైనా అడ్డు పడవద్దని వారు చంద్రబాబును డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా తెలంగాణవాదులు నినాదాలు చేశారు. తెలంగాణవాదులకు పోటీగా జై చంద్రబాబు అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
కాగా, బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడి ఇంటిని ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి కార్యకర్తలు మంగళవారం ఢిల్లీలో ముట్టడించారు. ఢిల్లీలో ఉన్న ఓయు జెఎసి నేతలు పిడమర్తి రవి, కైలాస్ తదితరులు వెంకయ్య నాయుడి నివాసానికి వెళ్లి ఆందోళనకు చేశారు.
తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెబుతూనే సీమాంధ్ర ప్రయోజనాల ముసుగులో తెలంగాణకు వెంకయ్య నాయుడు అడ్డుపడుతున్నారని వారు విమర్శించారు. తెలంగాణకు అడ్డుపడడం వెంకయ్య నాయుడు మానుకోవాలని వారు డిమాండ్ చేశారు.