కిరణ్ కావాలనే: రాష్ట్రపతికి టి నేతల ఫిర్యాదు, అడగండి
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు పైన ఎలాంటి గడువు పెంచవద్దని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కావాలనే బిల్లును అడ్డుకుంటున్నారని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి చెప్పారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు జానా రెడ్డి, డికె అరుణ, బస్వరాజు సారయ్య, రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, ఎంపీ రాజయ్య తదితరులు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ను కలిశారు.
ఈ సందర్భంగా వారు సీమాంధ్ర ప్రాంత నాయకులు తెలంగాణ బిల్లు పైన ఇచ్చిన సమయాన్ని సరిగా వినియోగించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. సభను అడ్డుకుంటున్నారని తెలిపారు. సీమాంధ్ర నేతలు గడువు పెంచాలని అడుగుతున్నారని, దానికి అంగీకరించవద్దని కోరారు.
విహెచ్ రాష్ట్రపతికి మఖ్యమంత్రి పైన ఫిర్యాదు చేశారు. కిరణ్ బహిరంగంగానే విభజనను అడ్డుకుంటానని ప్రకటిస్తున్నారన్నారు. కిరణ్ కావాలని ముసాయిదా బిల్లును అఢ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
రాష్ట్రపతిని కలిసిన అనంతరం మంత్రి డికె అరుణ మాట్లాడుతూ.. బిల్లుపై చర్చ జరగకుండా సీమాంధ్ర నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సీమాంధ్ర నేతలు తమకు ఏం కావాలో అడిగితే బాగుంటుందని విహెచ్ అన్నారు. రాష్ట్రపతితో తాను, జానా, దామోదర మాట్లాడామన్నారు. ముఖ్యమంత్రి బిల్లును ఓడిస్తామని ప్రకటనలు చేస్తున్నారని, ఈ విషయాన్ని తాను రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లానన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డా లేక అశోక్ బాబా చెప్పాలన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు రాష్ట్రపతిని వేరుగా కలిశారు.