కిరణ్Vsజానా: హరీష్ సిడి, ఏదో అనుకున్నానని మల్లేష్
కిరణ్ తన ప్రసంగంలో అద్వానీ, ఇందిర గాంధీల పేర్లను ప్రస్తావించారు. దీనిపై జానా స్పందించారు. లాభ నష్టాలను బేరీజు వేసుకోవడం సరికాదన్నారు. అద్వానీ, ఇందిర ఎవరు చెప్పినా అది బిల్లు రాకముందన్నారు. బిల్లు పైన ఓటింగ్ లేదా తీర్మానం ఉండదని, అభిప్రాయాలు మాత్రమే ఉంటాయని చెప్పారు.
విలీనం సమయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా సభ ఆమోదించిందని, ఇప్పటి బిల్లు కూడా అలాగే ఆమోదించాలన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన ఎందరు వ్యతిరేకంగా ఉన్నారో, ఎందరు అనుకూలంగా ఉన్నారో సంఖ్య చెబితే సరిపోతుందన్నారు. అభిప్రాయాలు చెప్పాలి తప్ప ఓటింగ్ అనడం సరికాదన్నారు.
కిరణ్ నిబంధనల ఉల్లంఘన: హరీష్ రావు
కిరణ్ తన ప్రసంగంలో నిబంధనలను ఉల్లంఘించారని తెరాస నేత హరీష్ రావు అన్నారు. తాను ఈ సమయంలో ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టకరమన్నారని, అది సరికాదన్నారు. సిఎం పదవి రాజ్యాంగమైనదని అలాంటప్పుడు దానిని కించపర్చేలా మాట్లాడవద్దన్నారు.
కిరణ్ ఆ పదాన్ని ఉపసంహరించుకోవాలి లేదా రికార్డుల నుండి తొలగించాలన్నారు. గతంలో సభలోనే ముఖ్యమంత్రి ప్రత్యేక రాష్ట్రం కేంద్రం పరిధిలో ఉందని, ప్రత్యేక రాష్ట్రం కోసం వేచి చూడాలని, కేంద్రం, తమ పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, ఏ నిర్ణయం తీసుకున్నా ముందుకు పోతామని, వ్యతిరేకంగా వెళ్లడం జరగదని చెప్పారని, అందుకు సంబంధించిన సిడిని ఇస్తున్నానని చెప్పారు.
ఆసక్తికర ప్రసంగం చేస్తారనుకున్నా: మల్లేష్
కిరణ్ సభలో ఈ రోజు ఆసక్తికర ప్రసంగం చేస్తారని తాను భావించానని కానీ అదేం లేదని గుండా మల్లేష్ అన్నారు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం కావాలని అప్పట్లో కమ్యూనిస్టులు పోరాడారని చెప్పారు. నాడు బేగంపేటలో ఇందిర గాంధీ ఏం చెప్పారో తెలుసుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులను పిట్టల్లా కాలుస్తున్నారని, తన గుండె తరుక్కుపోతోందని అన్నారని, తెలంగాణ సమస్య పరిష్కారం చేస్తానని హైదరాబాదులో చెప్పారని, ఢిల్లీ వెళ్లి మాట మార్చారని అన్నారు.
పెళ్లయ్యాక జాతకాలు కుదరలేదన్నట్లుగా: కిషన్ రెడ్డి
కిరణ్ ప్రసంగం రాంగ్ స్పీచ్ ఇన్ రాంగ్ టైమ్ అని బిజెపి నేత కిషన్ రెడ్డి అన్నారు. పెళ్లై పిల్లలు పుట్టాక జాతకాలు కుదరలేదన్నట్లుగా కిరణ్ తీరు ఉందన్నారు. కాంగ్రెసు అంతర్గత కుమ్ములాటల్లో ఎపి జీవితాన్ని బజారుకీడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలత జీవితాలతో చెలగాటమాడొద్దని, సోనియా, కాంగ్రెసు పార్టీలు తేల్చుకోవాలన్నారు.
వివరణ ఇవ్వాలి: అక్బర్
ముఖ్యమంత్రి వ్యాఖ్యల పైన ప్రభుత్వం, అధికార పార్టీ వివరణ ఇవ్వాలని మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. బిల్లుపై సభలో తీర్మానం తీసుకు రావాలంటే ముందు సభాపతి అనుమతి తీసుకోవాలన్నారు. దీని కోసం బిఏసి సమావేశం అవకసరమన్నారు.
ముఖ్యమంత్రిని మాట్లాడనివ్వాలి: సభాపతి
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన ముఖ్యమంత్రికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని సభాపతి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం ప్రకారమే మనం బిల్లు పైన ముందుకు వెళ్తామన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగం ముగియలేదని రేపు కూడా కొనసాగుతుందని చెప్పారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు.