ఢిల్లీలో ప్రభల తీర్థం- కోనసీమ సంస్కతికి అద్దం పట్టేలా..!!
అమరావతి: దేశ 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఢిల్లీలో కన్నుల పండువగా జరిగాయి. ఈ ఉదయం ఆరంభమైన ఈ వేడుకలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. జాతీయ గీతాలాపనతో ముగిశాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్తవ్య పథ్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పరాక్రమ దివస్ గా..
ఈ ఏడాది పరాక్రమ్ దివస్గా ఈ వేడుకలను జరుపుకొంది దేశం. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జన్మదినమైన 23వ తేదీన పరాక్రమ్ దివస్ వేడుకలు ఆరంభం అయ్యాయి. వారం రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ నెల 30వ తేదీన అమరవీరుల దినోత్సవంగా జరుపుకోనున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ముర్ము- దేశ ప్రజలను ఉద్దేశించి బుధవారమే ప్రసంగించారు. ప్రపంచంలోనే అయిదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఆవిర్భవించిందని అన్నారు.
సత్తా చాటిన ఆర్మీ..
ఈ రిపబ్లిక్ డే పరేడ్ లో- దేశ సైనిక పరాక్రమం సుస్పష్టమైంది. పరాక్రమ్ దివస్ నేపథ్యంలో త్రివిధ దళాలు తమ శక్తి సామర్థ్యాలను చాటాయి. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో రూపొందించిన 105 ఎంఎం లైట్ ఫీల్డ్ స్వదేశీ గన్స్ తో సెల్యూల్ చేశారు. ఈ తరహా గన్ రిపబ్లిక్ పరేడ్ లో పాల్గొనడం ఇదే తొలిసారి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన అగ్నిపథ్ కింద నియమించిన అగ్నివీరులు మొదటిసారిగా కవాతులో భాగమయ్యారు.
దేశ సాంస్కృతిక వైభవాన్ని..
దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెప్పేలా శకటాల ప్రదర్శన సాగింది. నారీ శక్తికి అద్దం పట్టాయి. న్యూ ఇండియా థీమ్ తో చేపట్టిన శకటాలు ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబింపజేశాయి. మొత్తం 23 శకటాలు ఈ ప్రదర్శనలు పాల్గొన్నాయి. ఏపీతో పాటు మరో 17 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 23 శకటాల ప్రదర్శన అహూతులను కట్టిపడేసింది. అస్సాం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లఢక్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వాటిని ఎంపిక చేసింది.
ఏపీ నుంచి కోనసీమ ప్రభల తీర్థం శకటం..
ఏపీ నుంచి చారిత్రాత్మకమైన కోనసీమ ప్రభల తీర్థం శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కోనసీమ ప్రభల తీర్థానికి 400 నుంచి 450 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం కనుమ నాడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 120 గ్రామాల్లో ప్రభల తీర్థాలను అత్యంత వైభవంగా ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. అంబాజీపేట మండలం మొసళ్లపల్లి జగ్గన్నతోట వద్ద ప్రభల తీర్థం ఊరేగింపు ఆరంభమౌతుంది. కోనసీమ జిల్లాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంటాయి.
కోనసీమ సంస్కృతి..
కోనసీమ ప్రభల తీర్థాన్ని ప్రతిబింబించేలా ఈ శకటాన్ని రూపొందించారు అధికారులు. ఎడ్లబండిని తోలుతోన్న రైతు, పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను ఉంచిన పల్లకీ, దాని వెనుక వైభవంగా అమర్చిన ప్రభలు.. ఇలా శకటాన్ని తీర్చిదిద్దారు. శకటానికి రెండు వైపులా కళాకారుల నృత్య ప్రదర్శన ఆహ్వానితులను ఆకట్టుకుంది. ఈ శకటం, దాని ప్రత్యేకతలను మైక్ లో వివరించారు.