మీ ఫ్యాన్స్కు చెప్పండి: తలసాని, ప్రమాణం చేసిన వెంకీ, రకుల్ ప్రీత్
హైదరాబాద్: సినిమా నటీనటులు సమాజాన్ని ప్రభావితం చేయగలరని, ఆ శక్తి వారికి ఉందని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం అన్నారు. ఫిలిం నగర్లో సినీ ప్రముఖులతో కలిసి ఆయన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో స్వచ్ఛ హైదరాబాద్ కోసం ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. నటీనటులు స్వచ్ఛ హైదరాబాదు కార్యక్రమంలో పాల్గొనాలని, విశేషంగా ప్రచారం కల్పించాలని కోరారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ప్రజలు, తమ అభిమానులు విస్తృతంగా, ఉత్సాహంగా పాల్గొనేలా నటీనటులు ఉత్తేజపరచాలన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమను దేశంలోనే ఉన్నతస్థాయికి తీసుకు వెళ్తామని తలసాని చెప్పారు. మీ అభిమానులకు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనాలని హీరోలు చెప్పాలని కోరారు. పరిసరాలు, రహదారులు పరిశుభ్రంగా ఉంచవలసలిన బాధ్యత స్థానికులదే అన్నారు.
స్వచ్ఛ హైదరాబాద్ సామాజిక బాధ్యత అన్నారు. రూ.25 కోట్లతో మూడేళ్లలో రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని తలసాని చెప్పారు.
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో తలసానితో పాటు సినీ ప్రముఖులు వెంకటేష్, రాఘవేంద్ర రావు, దగ్గుబాటి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్, జీవిత, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ హైదరాబాద్కు అందరు మద్దతివ్వాలని ఈ సందర్భంగా వారు సూచించారు. వారు చీపురు పట్టి రోడ్లు ఊడ్చారు.