బిడ్డా! ఆలోచించు: బాబుకు తలసాని, కేసీఆర్కు సూచన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తాను మొదటి నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్నామని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ తర్వాతే వచ్చారని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం అన్నారు. తెలంగాణలో టీడీపీ నుండి గెలుపొందిన తీగల కృష్ణా రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ తదితరులు కేసీఆర్ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
చంద్రబాబు పైన తలసాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పలుమార్లు చంద్రబాబును బిడ్డా అంటూ సంబోధించారు. కేసీఆర్ పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం అన్నారు. కేసిఆర్ పక్కా విజన్తో ముందుకు పోతున్నారన్నారు. ముప్పై ఏళ్లుగా పార్టీలో ఉన్న వారు ఎందుకు వీడుతున్నారో చంద్రబాబు ఆలోచించాలన్నారు. కేసీఆర్, తన లాంటి వారి టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు లేడని విమర్శించారు.
తుమ్మల నాగేశ్వర రావు టీడీపీని వీడినప్పుడు.. చంద్రబాబు మాట్లాడుతూ, ఒక్క నేత పోతే వందమందిని తయారు చేస్తానని మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్కు ప్రజలే దేవుళ్లు అయితే, చంద్రబాబుకు కాంట్రాక్టర్లే దేవుళ్లని ఎద్దేవా చేశారు. ఒరిజినల్ టీడీపీ ఎప్పుడో పోయిందన్నారు. చంద్రబాబుకు చెందిన బ్రోకర్లంతా తెరాస ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణ టీడీపీ నేతలు, ఆంధ్రా మీడియా, ఏపీ ప్రభుత్వం తెలంగాణలోని ప్రతి విషయాన్ని మసి పూసి మారేడుకాయ చేస్తున్నారన్నారు. ఆంధ్రా మీడియా తెరాస ప్రభుత్వం పైన అక్కసు వెళ్లగక్కుతోందన్నారు. భవిష్యత్తులో నగరంలో ప్రతి వీధిలో తెరాస జెండా ఎగరాలన్నారు.
తెలంగాణ అభివృద్ధి కోసం అందరు తెరాసకు అండగా నిలవాలన్నారు. కేసీఆర్కు అండగా ఉండి బంగారు తెలంగాణ కోసం పాటుపడతామని గంగాధర్ అన్నారు. తెరాస ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఆంధ్రా పార్టీలకు కొమ్ము కాస్తున్నారన్నారు. తెరాస ప్రభుత్వం పైన లేనిపోని విమర్శలు చేయవద్దన్నారు.
తన జీవితంలో ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉందని తీగల కృష్ణా రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రానికి కరెంట్ ఇవ్వడం లేదన్నారు. కరెంటు కోతకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. సమగ్ర సర్వేను ప్రజలంతా కొనియాడుతుంటే.. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. కేసీఆర్ తనకు కొండంత భరోసా ఇచ్చారన్నారు.
కేసీఆర్, చంద్రబాబు తలసాని విజ్ఞప్తి
కేసీఆర్, చంద్రబాబుకు తలసాని విజ్ఞప్తి చేశారు. సమైక్య ఏపీకి తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు వీలైతే తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని లేదంటే నీ పని నీవు చూసుకోవాలని సూచించారు. చిల్లర రాజకీయాలు చేయవద్దని హెచ్చరించారు.
అలాగే, హైదరాబాదులో ఎవరు కూడా అభద్రతా భావానికి లోనుకాకుండా చూసుకోవాలని కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. తెరాస ప్రభుత్వం వచ్చిన నాలుగున్నరేళ్లలో నగరంలో ఎక్కడ కూడా ఎవరికీ ఇబ్బంది కలగలేదన్నారు. కానీ కొందరు అభూతకల్పన కల్పిస్తున్నారన్నారు. తెలంగాణలో ఎలాగు టీడీపీ అధికారంలోకి రాదని కృష్ణయ్యను సీఎంగా ప్రకటించారని ఎద్దేవా చేశారు.