ఎమ్మెల్యే పదవికి తలసాని శ్రీనివాస యాదవ్ రాజీనామా
హైదరాబాద్: త్వరలో మంత్రి పదవి చేపట్టబోతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన స్పీకర్ మధుసూదనాచారికి అందించారు. నైతిక విలువలకు, ప్రజాస్వామిక సూత్రాలకు కట్టుబడి తాను రాజీనామా చేసినట్లు ఆయన మంగళవారం ఉదయం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల అభివృద్ధికి తాను పాటుపడుతానని ఆయన చెప్పారు.
ఎవరో చెప్తే నేర్చుకునే స్థితిలో తాను లేనని ఆయన అన్నారు. టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు తాను రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఆరుసార్లు తాను అసెంబ్లీకి పోటీ నాలుగు సార్లు గెలిచానని, భవిష్యత్తులో కూడా పోటీ చేస్తానని ఆయన చెప్పారు. ఒక్క ఉప ఎన్నికల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన కోసం ప్రచారానికి వచ్చారని ఆయన అన్నారు.
పాతికేళ్లు టిడిపిలో ఉన్నానని ఆయన చెప్పారు. రాజకీయాల్లో చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతుంటారని, నైతిక విలువల గురించీ ప్రజాస్వామ్యం గురించి వారు చెప్తే నేర్చుకునే స్థితిలో తాను లేనని ఆయన అన్నారు సనత్నగర్ ప్రజల ఆప్యాయత మరిచిపోలేనని ఆయన అన్నారు. తాను ఏమిటనే విషయం అందరికీ తెలుసునని, ఉదారతతో తనను ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రివర్గంలోకి తీసుకుంటానని చెప్పారని, అందుకు ధన్యవాదాలని, ఎన్నికల్లో ఏం జరుగతుందనేది అప్రస్తుతమని ఆయన అన్నారు.
నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. పనికి రానివాళ్లు మాట్లాడే విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తన డ్యూటీ తాను చేస్తానని ఆయన చెప్పారు. టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. గెలిచిన వెంటనే పార్టీ మారిన చరిత్ర కొంత మందికి ఉందని ఆయన చెప్పారు. తనకు పదవులపై ఆరాటం లేదని ఆయన చెప్పారు. ఓడిపోయినా తాను రాజ్యసభ సీటు గానీ ఎమ్మెల్సీ పదవి గానీ అడగలేదని ఆయన చెప్పారు. ప్రజాసేవకు, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.